పురంధేశ్వరికి అసలుకే ఎసరు: విశాఖ సీటు వెనక్కి?
హరిబాబును ఒప్పించి, పురంధేశ్వరికి విశాఖ సీటును కేటాయించేందుకు బిజెపిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దానికి విరుగుడు కనిపెట్టింది. విశాఖ సీటును బిజెపి నుంచి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
విశాఖపట్నం సీటును తాము తీసుకుని కాకినాడ సీటును బిజెపికి కేటాయించాలని తాజాగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు చంద్రబాబు బిజెపి జాతీయ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విశాఖ నుంచి గంటా శ్రీనివాస రావును పోటీకి దించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు వల్ల పురంధేశ్వరి కష్టాల్లో పడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసుకు రాజీనామా చేసి, పురంధేశ్వరి బిజెపిలో చేరారు. అయితే, చంద్రబాబ నాయుడు తొలి నుంచీ పురంధేశ్వరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుతో తనకు ఏ విధమైన వైరం లేదని, అధికార మార్పిడి తీరును వ్యతిరేకించానని పురంధేశ్వరి చెప్పినప్పటికీ చంద్రబాబు మనసు కరగడం లేదని అంటున్నారు.