పుత్తూరులో గ్రానైట్ క్వారీల దౌర్జన్యం.. పొలం దున్నుతున్న రైతుపై పడ్డ భారీ రాయి..!
పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో నడిబొడ్డున ఉన్న చెర్లోపల్లి గ్రామంలో నిత్యం జరుగుతున్న అక్రమ గ్రానైట్ క్వారీ బ్లాస్టింగ్ ల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవలికాలంలో అధికారుల నిఘా లోపించడంతో క్వారీ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి పేలుళ్లు జరుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం గ్రామానికి చెందిన ఈశ్వర్ యాదవ్ అనే రైతు తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నుతుండగా.. సమీపంలోని గ్రానైట్ క్వారీ నుంచి ఒక్కసారిగా అక్రమ బ్లాస్టింగ్ జరిపారు.
అయితే ఆ పేలుడు ధాటికి భారీ క్వారీ రాయి తీవ్రమైన వేగంతో వచ్చి.. పొలం దున్నుతున్న రైతు ఈశ్వర్ యాదవ్ పక్కనే సడన్ గా పడిపోయింది. తృణప్రాయంలో ప్రాణాపాయం తప్పడంతో సదరు రైతు భయంతో అవాక్కై అక్కడినుంచి వెంటనే పరుగులు తీశాడు. క్వారీ రాయి పడిన వేగానికి పెద్ద గుంత పడటంతో, కొద్దిలో తప్పకపోతే ప్రాణాలు పోయేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
భయం గుప్పిట్లో చెర్లోపల్లి ప్రజలు
క్వారీల నుంచి వచ్చే రసాయనాలు, విపరీతమైన శబ్దాలు, గాల్లోకి ఎగిరిపడే రాళ్ల వల్ల ఇళ్లల్లో ఉండాలన్నా, పొలాల్లో పనులు చేసుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం జరగాల్సిన బ్లాస్టింగ్లను పక్కనబెట్టి, లాభాపేక్షతో అక్రమంగా ఎక్కువ పరిమాణంలో పేలుడు పదార్థాలు వాడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు తక్షణమే అక్రమంగా బ్లాస్టింగ్లు జరుపుతున్న గ్రానైట్ క్వారీలపై మైనింగ్, రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు ఈశ్వర్ యాదవ్ ప్రాణాలకు ముప్పు తెచ్చిన క్వారీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని అంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ క్వారీల నిర్వహణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications