కేంద్ర బలగాలతో భద్రత కల్పించండి - అమిత్ షాకు రఘురామ వినతి..!!
ఇప్పుడు ఏపీ రాజకీయాలు అమరావతి - మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతి రైతులు అరసవల్లి వరకు చేస్తున్న మహా పాదయాత్ర పైన ఉత్తరాంధ్ర మంత్రులు...వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. దీనిని ఉత్తరాంధ్ర పైన దండయాత్రగా పేర్కొంటున్నారు. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకొని విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని చెబుతున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదే సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖ రాసారు. రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు చేస్తున్న మహా పాదయాత్రకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్తో రైతులు ఈ పాదయాత్ర చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అమరావతి రైతులు దాదాపు వెయ్యి కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేస్తున్నారని వివరించారు. గతంలోనూ న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ఈ పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు మద్దతిస్తున్న విషయాలన్ని ఆ లేఖ లో ప్రస్తావించారు.

ఏపీ పోలీసు ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరించగా.. రైతులు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారని వివరించారు. ఏపీ మంత్రులు పదే పదే మూడు రాజధానుల అంశం పైన మాట్లాడుతున్నారని..ఇది కోర్టు తీర్పుకు విరుద్దమని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఇలా వ్యాఖ్యలు చేయటం కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా లేఖలో వివరించారు. ఇవన్నీ చూస్తుంటే రైతుల పాదయాత్రలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. వీటిని పరిగణలోకి తీసుకొని రైతుల పాదయాత్రకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని రఘురామ తన లేఖలో కేంద్ర హోం మంత్రిని అభ్యర్దించారు. దీని పైన అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications