ఫోన్ ట్యాపింగ్: ఏపీ సర్కారుపై రఘురామ కృష్ణంరాజుపై సంచలన ఆరోపణలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై తరచూ విమర్శలు చేస్తున్న అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారంటూ ఈ నరసాపురం ఎంపీ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు.
గత కొన్ని నెలలుగా తాను వినియోగించే రెండు ఫోన్ నెంబర్లను ట్యాప్ చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు. కొన్ని రోజులుగా కాల్స్ మాట్లాడేటప్పుడు అవాంతరాలు ఎదురవుతున్నాయని, ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21ను ఉల్లంఘించడమేనని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. అంతేగాకుండా, తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు.
కాగా, ఇటీవల హైకోర్టులో కొందరు జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ పలు మీడియా ఛానళ్లలో వచ్చిన కథనాలు రాష్ట్రంలో దుమారం రేపింది. ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు కేంద్రానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య కొందరు దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి కథనాల మీద న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో తాజాగా సీఎం జగన్ ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇప్పటికే పలుమార్లు ఏపీ సర్కారు విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై కూడా వైసీపీ నేతలు అదే స్థాయిలో విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications