సీఐడీ పోలీసులకు ఎంపీ రఘురామ లేఖ - నేడు విచారణ : క్లారిటీ ఇచ్చిన రెబల్ ఎంపీ..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు సీఐడీకీ లేఖ రాసారు. కొద్ది నెలల క్రితం సీఎం జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ సీఐడీ ఆయన పైన కేసు నమోదు చేసింది. ఆ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసింది. దీని పైన రఘురామ సుప్రీంలో బెయిల్ పొందారు. కాగా, సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు తన సొంత నియోజకవర్గం నర్సాపురం రావాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా హైదరాబాద్ చేరుకున్న రఘురామకు సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. ఈ నెల 17వ తేదీన (ఈ రోజు) మధ్నాహ్నం 3 గంటలకు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు.
సీఐడీ నోటీసుల పై కోర్టుకు
తాను చట్టాన్ని గౌరవిస్తానని... తాను కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేస్తూ విచారణకు హాజరువుతానని చెప్పుకొచ్చారు. అయితే, నర్సాపురం వెళ్లి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనాలని భావించిన రఘురామ రాజు అక్కడకు వెళ్లకుండానే తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. తాను నోటీసుల పైన న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చానని.. ఎవరూ విమానాశ్రయానికి రావద్దంటూ రఘురామ సూచించారు. ఇక, ఈ రోజు రఘురామ సీఐడీ ముందుకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా..తాజాగా, సీఐడీకీ ఎంపీ లేఖ రాసారు. సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ రోజు విచారణకు రాలేనంటూ
అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేనని లేఖలో వెల్లడించారు. తాను ఢిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యాయనని లేఖలో వివరించారు. తనకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కావాలని లేఖలో కోరారు. ఇప్పుడు రఘురామ లేఖ పైన సీఐడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక, రాజకీయంగా రఘురామ ఇప్పటికే కీలక ప్రకటన చేసారు. ఫిబ్రవరి 5 తరువాత తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు రఘురామ వెల్లడించారు. తాను నర్సాపురం నుంచి పోటీ చేసి వైసీపీని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేసారు. అన్ని పార్టీలు .. అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతివ్వాలని కోరారు. అయితే, రఘురామ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
నాలుగు వారాల సమయం కోరిన ఎంపీ
మరో వైపు వైసీపీ నేతలు మాత్రం అసలు రఘురామ రాజీనామా చేస్తారా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీని పైన ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి .. రఘురామ మధ్య మాటల యుద్దం సాగుతోంది. చెప్పిన మాట ప్రకారం రఘురామ రాజీనామా చేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో.. ఫిబ్రవరి 5 తరువాత ఆయన రాజీనామా చేస్తారా లేదా.. చేస్తే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు.. వైసీపీ నుంచి నర్సాపురం బరిలో ఎవరు దిగుతారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు రఘురామ తాను విచారణకు రాలేనంటూ..సీఐడీకి లేఖ రాయటంతో.. సీఐడి స్పందన పైన ఆసక్తి నెలకొని ఉంది.