Raghurama krishnam Raju : ఇంటి అడ్రెస్ చెప్తారా అంటే గోతుల లెక్క చెప్పాలి, సీఎం జగన్ కు లేఖలో షాకింగ్ సలహా !!
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి వరుస లేఖాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. జగన్ కు తాను విధేయుడని పేర్కొంటూనే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా రాష్ట్ర రహదారుల వాస్తవ పరిస్థితిపై జగన్ మోహన్ రెడ్డి లేఖాస్త్రం సంధించారు. ఇప్పటికే నవ హామీలు వైఫల్యాలు పేరుతో 9 లేఖలు రాసిన రఘురామకృష్ణంరాజు నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరికొన్ని లేఖలను, ప్రస్తుతం నవ సూచనల పేరుతో లేఖలను రాస్తున్నారు. తాజాగా రాష్ట్ర రహదారుల దారుణ పరిస్థితిపై సీఎం జగన్ కు రాసిన లేఖలో ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి ఇదే
ఒక్క నా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రహదారుల పరిస్థితి ఇదే విధంగా ఉంది అంటూ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతల మయంగా మారాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంటి అడ్రస్ కనుక్కోవాలంటే గోతులు లెక్క చెప్పుకునే పరిస్థితి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని మొత్తం రోడ్ల పొడవులో మన రాష్ట్రంలోని హైవేలు 5.46 శాతం. రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను అందిస్తుంది. అంతర్రాష్ట్ర రహదారులకు 100% గ్రాంట్ ఇస్తుంది. ఆర్థిక ప్రాముఖ్యత ఉన్న రోడ్డు ప్రాజెక్టులకు 50 శాతం గ్రాంటు ప్రభుత్వం అందజేస్తోంది.

వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని తక్షణం మరమ్మత్తులు చేయించండి
రాష్ట్రంలో ఉన్న8763 కిలోమీటర్ల రోడ్ల కోసం విడుదలవుతున్న నిధులను చూసినా, రోడ్ల అభివృద్ధి కోసం వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న టోల్ గేట్ సెస్ చూసినా ప్రజలు అవాక్కవుతున్నారు. దారుణంగా ఉన్న రోడ్ల దుస్థితి ని చూసి వారు ఆందోళన చెందుతున్నారు అంటూ రఘురామకృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు . రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయి . వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని తక్షణమే వాటికి మరమ్మతులు చేయించాలని ముఖ్యమంత్రి జగన్ కు సూచిస్తున్నా అంటూ రఘురామ తన లేఖ ద్వారా తెలియజేశారు.

రాష్ట్ర రోడ్లకు టోల్ సెస్ .. అయినా మరమ్మత్తులేవీ ?
ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర రహదారులపైన వాహనదారుల నుండి ఏపీ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టోల్ ప్లాజా ఏర్పాటు చేసి రాష్ట్ర టోల్ ఫీజు వసూలు చేయాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కూడా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. రాష్ట్ర రహదారుల పైన కూడా టోల్ పన్నులు వసూలు చేస్తూ, గుంతల మయం అయిన రోడ్లపై ప్రయాణం చేయాలంటే వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మరమ్మతులు చేయకుండా టోల్ ఫీజు వసూలు చేయడాన్ని వాహనదారులు విమర్శిస్తున్నారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

నాసిరకం కాంట్రాక్టర్లు, పట్టించుకోని సర్కార్ .. యమకూపాలుగా రోడ్లు
రాష్ట్రంలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో పాటు,నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల తీరుతో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుందన్నారు. ప్రభుత్వం సరిగా టైముకు బిల్లులు చెల్లించకపోవటంతో, ప్రథమ శ్రేణి కాంట్రాక్టర్లు రోడ్ల పనులు చేయడానికి ఆసక్తి చూపించడం లేదని, ఫలితంగా నైపుణ్యం లేని కాంట్రాక్టర్ల పనులతో రోడ్లు కొట్టుకుపోయి యమ కూపాలుగా మారుతున్నాయని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఇక తన నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు వర్చువల్ మీటింగ్ ద్వారా తెలుసుకున్నానని పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు.

మీరు అశోక చక్రవర్తి, చంద్రగుప్త రాజులా మారకండి.. మొఘల్ చక్రవర్తుల్లా ఉండండి చాలు
రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అశోక చక్రవర్తి లాగానో, చంద్రగుప్త రాజు లాగానో మారిపొమ్మని చెప్పడంలేదు. వారు రహదారులను నిర్మించి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేశారు . మీరు మొఘల్ చక్రవర్తుల్లా ఉంటే చాలు అంటూ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అంతకు ముందు పాలకులు నిర్మించిన రహదారులను మొఘల్ చక్రవర్తులు చక్కగా నిర్వహించారు. ప్రస్తుతం జగన్ సర్కార్ కూడా అది చేస్తే సరిపోతుందని రఘురామ అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న రోడ్ల పరిస్థితి అప్పట్లో వారు నిర్మించిన గ్రాండ్ ట్రంక్ రోడ్ లకు పూర్తిగా భిన్నంగా ఉంది. అప్పుడు ఆ రోడ్లు అద్దంలా ఉండేవి ఇప్పుడు అడ్డదిడ్డంగా ఉన్నాయి అంటూ రఘురామ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

హెలికాఫ్టర్ , విమానాల్లో ప్రయాణం మానేసి రోడ్డు మార్గాన ప్రయాణం చెయ్యండి ... జగన్ కు సలహా
ఇదే సమయంలో జగన్ కు సలహా ఇచ్చారు. మీరు కొంతకాలం పాటు హెలికాప్టర్లు, విమానాల్లో ప్రయాణం చేయడం మానేసి త్వరలో ప్రారంభించబోతున్న రచ్చబండ కార్యక్రమానికి ఆయన రోడ్డు మార్గాన ప్రయాణం చేసి చూడండి. అప్పుడు మీ పాలనలో రోడ్ల పరిస్థితి ఎంత బాగుందో మీరే కళ్లారా చూడొచ్చు తనువారా ఆస్వాదించవచ్చు తద్వారా ప్రజలు అనుభవిస్తున్న రోడ్డు బాధలు మీకు అర్థం అవుతాయి అప్పుడైనా మీరు రహదారుల అభివృద్ధి పై శ్రద్ధ చూపుతారు ఇదే నా ఆశ అంటూ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సూచన తెలియజేశారు.












Click it and Unblock the Notifications