జగన్ పై సీఈసీకి రఘురామ ఫిర్యాదు-శాశ్వత నియామకంపై-కరుణానిధి కేసుపై క్లారిటీ
ఏపీలో వైసీపీ వర్సెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య సాగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ను నియమిస్తూ ఆ పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాన్ని రెబెల్ ఎంపీ రఘురామ ఇవాళ ఎన్నికల సంఘం వద్ద సవాల్ చేశారు. అయితే ప్లీనరీ తీర్మానం అందాక తగు చర్యలు తీసుకుంటామని ఈసీ తెలిపింది. మరోవైపు గతంలో డీఎంకే శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిది పనిచేశారంటూ వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘురామ క్లారిటీ ఇచ్చారు.
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ ప్లీనరీలో తాజాగా తీర్మానంచేశారు. అలాగే పార్టీ రాజ్యాంగాన్ని సవరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అక్కడే ఆమోదముద్ర కూడా వేసి జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించేశారు కూడా. దీనిపై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని నియంతృత్వంగా కొందరు అభివర్ణిస్తుంటే మరికొందరు మాత్రం జగన్ కు ఆ హక్కు ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ వ్యపహారం మరో మలుపు తిరిగింది.
ఈసీకి రఘురామ ఫిర్యాదు
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ను నియమించిన వ్యవహారంపై పార్టీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలిశారు. అయితే వైసీపీ ప్లినరీ తీర్మానం ఇంకా ఎన్నికల కమిషన్ వద్దకు రాలేదని అధికారులు ఆయనకు తెలిపారు. తమకు సమాచారం అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారి చెప్పారన్నారు. దీంతో రఘురామరాజు ఈ సమాచారం ఈసీకి అందే వరకూ వేచి చూడాల్సిన పరిస్ధితి నెలకొంది. దీనిపై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరుణానిధి శాశ్వత అధ్యక్షుడు ఇలా..
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధి ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారని, అయితే సాయిరెడ్డి ఇక్కడొక విషయం తెలుసుకోవాలని రఘురామ అన్నారు. డీఎంకే పార్టీ అధ్యక్ష పదవికి ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగి కరుణానిధి శాశ్వత అధ్యక్షుడు పదవిలో కొనసాగారని, ఈ విషయమై డీఎంకే నేతలతో కూడా మాట్లాడానని, డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని వాళ్లు స్పష్టంగా చెప్పారన్నారు. ఎన్నికలు లేకుండా శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధి లేరని, ఉన్నారని అంటున్న సాయిరెడ్డి నిరూపించాలన్నారు. నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని రఘురామ సవాల్ విసిరారు.