చిరు కాంగ్రెస్లో ఉంటారని రఘువీరా, కెసిఆర్పై ఆగ్రహం
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారంపై ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి శనివారం మరోసారి స్పందించారు. చిరంజీవి కాంగ్రెసు పార్టీలోనే ఉంటారని తాను విశ్వసిస్తున్నానని, ఆయన బిజెపిలో చేరుతారనే ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు.
మరోవైపు ఉద్యోగుల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, రెచ్చగొట్టేలా కెసిఆర్ ప్రకటనలు చేయడం విచారకరమని, ఆయన ఏం ఆశించి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని రఘువీరా అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి ఇలా వివాదాస్పద ప్రకటనలు చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంతో హుందాగా ఉండాలని, అందరి బాగోగులు చూసుకోవాలని హితవుపలికారు. ఇప్పటికే కేసిఆర్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టారన్నారు. ఇలాంటి వివాదాస్పద ప్రకటనల వల్ల ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు.
అంతేగాక హైదరాబాదుకు తీరని నష్టం జరుగుతుందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు హైదరాబాదులో ఉన్నారన్న వాస్తవాన్ని కెసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లో 1.29 వేల కోట్ల పంట రుణాలు ఉన్నాయని వీటిని టిడిపి పూర్తిగా మాఫీ చేస్తుందన్న విశ్వాసం తమకుందన్నారు. అయితే చంద్రబాబు చేస్తున్న ప్రకటనల వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు.












Click it and Unblock the Notifications