ఒక్క మాట అనకుండా వచ్చేశారు, ధైర్యం లేదు: జగన్పై రఘువీరా
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాను డ్రామాగా ఆంధ్రప్రదేశ్ పిసిసిఅధ్యక్షుడు రఘువీరా రెడ్డి అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని ఒక్క మాట అనకుండా జగన్ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చేశారని ఆయన అన్నారు.
మోడీని ప్రశ్నించే ధైర్యం జగన్కు లేదని ఆయన అన్నారు. ప్రణాళికా సంఘం పేరుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అభ్యంతరం చెబుతున్న బిజెపి కేవలం మంత్రివర్గ తీర్మానంతోనే 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా పొందిన విషయాన్ని మరిచిపోయినట్లుందని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయకపోతే ఈ నెల 13వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిలపై కేసులు పెడుతామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయడవాడలో కూర్చున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. వారానికి నాలుగు రోజులు విజయవాడులో ఉండాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తప్పు చేసి కారణాలు వెతుక్కుంటోందని రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్త బంద్కు వామపక్షాలు పిలుపు ఇచ్చిన మేరకు కృష్ణా జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. విజయవాడలో జరుగుతున్న బంద్లో పాల్గొన్న రఘువీరారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ రూ. 5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయోజనాలను, హోదాతోపాటు పోలవరం, రాయలసీమ, ఉత్తర కోస్తాకు ప్రత్యేక ప్యాకేజి, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవన్నీ కోరడం జరిగిందని రఘువీరారెడ్డి తెలిపారు.
దానికంటే ఎక్కువ చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన మాటను అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ సీఎం, మంత్రులు, ఎంపీలు అందరూ ఢిల్లీలో కూర్చుని హోదాపై కేంద్రాన్ని నిలదీయాలని ఆయన అన్నారు.
తాము ప్రజా పోరాటాలు చేస్తామని, మీరు ప్రత్యేక హోదా సాధించుకురావాలని రఘువీరారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాకోసం మంగళవారంనాడు ప్రతిపక్షాలు రాష్ట్ర బంద్ తలపెట్టిన విషయం తెలిసిందే.