సీమాంధ్ర పిసిసి చీఫ్ రఘువీరా: తెలంగాణకు పొన్నాల
హైదరాబాద్: సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) పిసిసి అధ్యక్షుడిగా రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన ఎన్. రఘువీరా రెడ్డిని నియమించారు. ఇందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి ఆయనను అభినందించారు. బొత్స సత్యనారాయణను సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయలసీమకు బిసి నేత రఘువీరా రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెసు అధిష్టానం నియమించింది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య నియమితులయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. ప్రచార కమిటీ చైర్మన్గా దామోదర రాజనర్సింహ, కో చైర్మన్గా షబ్బీర్ అలీ నియామకం జరిగింది. ఎన్నికల ప్రణాళికా కమిటీ చైర్మన్గా శ్రీధర్ బాబు నియమితులయ్యారు. కో చైర్మన్గా మల్లు భట్టి విక్రమార్క నియమితులయ్యారు.
కాగా, సీమాంద్ర ప్రచార కమిటీ చైర్మన్గా చిరంజీవి, కో చైర్మన్గా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియమితులయ్యారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఆనం రామనారాయణ రెడ్డి, కో చైర్మన్గా పనబాక లక్ష్మి నియయమితులయ్యారు.
అత్యంత క్లిష్టమైన సమయంలో తనకు అధిష్టానం ఈ బాధ్యతలు అప్పగించిందని ఆయన అన్నారు. తుది శ్వాస వరకు కాంగ్రెసులో కొనసాగుతానని ఆయన చెప్పారు. పార్టీ బాగున్నప్పుడు పలు పదవులు అనుభవించామని, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టడానికి పనిచేయాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని సీనియర్ నాయకులు పార్టీని వీడిన నేపథ్యంలో తమ సత్తాను చాటుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకులకు అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. విభజనకు నిర్ణయం తీసుకున్న చివరి పార్టీ తమదని, అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్న తర్వాతనే తమ పార్టీ తీసుకుందని ఆయన చెప్పారు అందరి సహకారంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
ప్రస్తుత సంక్షోభంలో అందరి సహకారం తీసుకుని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని రఘువీరా రెడ్డి చెప్పారు. కార్యకర్తలందరిలో తాను మొదటి కార్యకర్తగా ఉంటానని ఆయన చెప్పారు. ప్రస్తుత అవకాశాన్ని కాంగ్రెసు శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. సీమాంద్రను అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేద్దామని ఆయన అన్నారు రఘువీరా రెడ్డి శిబిరం ఆనందోత్సాహాల్లో ఉంది. స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంది.












Click it and Unblock the Notifications