చంద్రబాబే క్షమాపణ చెప్పాలి: గజల్ శ్రీనివాస్ ఇష్యూపై రఘువీరా
Recommended Video
విజయవాడ: గజల్ శ్రీనివాస్ వ్యవహారంపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బుద్ధే వక్రబుద్ధి అని, అందుకే అలాంటి వారిని ఎంపిక చేస్తోందని విమర్శించారు.
గజల్ శ్రీనివాస్ తమ పార్టీలో ఎప్పుడూ తిరగలేదని స్పష్టం చేశారు. స్వచ్ఛంగా ఉండాల్సిన అంబాసిడరే అలా చేసినందుకు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు.
ఇంద్రకీలాద్రిలో తాంత్రిక పూజలపై ఇలా
ఆలయంలో అర్ధరాత్రి పూజలు జరిగాయని దుర్గగుడి చైర్మన్ అంగీకరించారని రఘువీరా రెడ్డి అన్నారు. అధికారులతో మాట్లాడుదామంటే భయపడిపోతున్నారని, దుర్గమ్మ సన్నిధిలో ఎవ్వరూ అబద్ధాలు ఆడలేరని అన్నారు. అలాగని నిజం చెప్పాలంటే నోటికి తాళాలు వేస్తున్నారని అన్నారు.
అక్కడ ఎప్పుడూ అపచారమే...
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా దుర్గగుడి లో ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉందని రఘువీరా రెడ్డి అన్నారు. గతంలో అమ్మవారి ముక్కుపుడక విషయంలో ప్రభుత్వం మూల్యం చెల్లించుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆలయంలో పాలక మండలి నోరు విప్పకూడదని టీడీపీ నేతలు హుకుం జారీ చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని రఘువీరా అభిప్రాయపడ్డారు.
వారి మనోభావాలు దెబ్బ తినకుండా..
భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దుర్గగుడి వ్యవహారంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం, దేవాదాయశాఖ సమాధానం చెప్పాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. పూజలు జరిగాయనేది వాస్తవమని, జరగలేదని బుకాయించవద్దని అన్నారు. ఈ వ్యవహారంపై సిట్డింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
రేపటి నుంచి పోలవరం యాత్రం..
పోలవరం ప్రాజెక్టుకు పాదయాత్ర చేపడుతున్నట్లు రఘువీరా రెడ్డి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికి ఈ పాదయాత్ర చేపడుతున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు పాదయాత్ర చేయనున్నారు. పదవ తేదీ వరకు ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు పాదయాత్ర సాగుతుందని ాయన చెప్పారు. ఆ తర్వాత పదవ తేదీన సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.