విదేశీలతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు: రఘవీరా, ఇన్ఫినిటీ రైడ్లో లోకేశ్ సందడి
గుంటూరు: రాజధాని కోసం సేకరించిన భూమిని ఏం చేస్తున్నారో తెలపాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను రఘువీరా రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతీయలు ఇతర కంపెనీలకు సీఈఓలుగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులను ఇతర దేశాలకు చెందిన కంపెనీలకు అప్పగించడం భారతీయులను అవమానపర్చడమేనని మండిపడ్డారు.
నవ్యాంధ్ర రాజధాని కోసం 34వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం వాటిని ఏం చేయబోతుందో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సహకారం లేకుండా విదేశీ ప్రతినిధులతో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటుందని ఆరోపించారు.
ప్రజల నుంచి సేకరించిన భూములను 99 ఏళ్ల పాటు సింగపూర్, జపాన్ కంపెనీలకు లీజుకు ఇవ్వాలనుకోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. అంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు సహా మంత్రులు హోల్ సేల్ నుంచి రిటైల్గా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. విదేశీలతో చీకటి ఒప్పందాలు రద్దు చేసుకుని మన రాజధానిని మనమే నిర్మించుకోవాలని ఆయన సూచించారు.

ఇన్ఫ్నిటీరైడ్ సైకిల్ యాత్రలో పాల్గొన్న లోకేష్
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో శనివారం ఉదయం ఇన్ఫినిటీ సైకిల్ రైడ్ పేరిట భారీ కార్యక్రమం జరిగింది. టీడీపీ యువనేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ ఈ ర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఇన్ఫ్నిటీరైడ్ సైకిల్ యాత్రలో ఆయన పాల్గొని ఏకంగా 30 కిలో మీటర్ల మేర యువతతో కలిసి సైకిల్ తొక్కారు. వికలాంగులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 2.60 కోట్ల మంది వికలాంగుల కోసం ఆదిత్యా మెహతా చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసలు కురిపించారు.
ఆయన అందిస్తోన్న కృషికి ఎన్టీఆర్ ట్రస్ట్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఒంటికాలితో 570 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయడం గొప్ప విషయమని అని నారా లోకేష్ అన్నారు. టాలీవుడ్ అందాల భామ రెజీనా ఈ ర్యాలీలో పాల్గొని యువతలో ఉత్సాహం నింపింది.












Click it and Unblock the Notifications