మాతో పొత్తు పెట్టుకుంటే: రఘువీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు, ఏపీలో కలుస్తారా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు అంశంపై ఏపీసీసీ రఘువీరా రెడ్డి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో రఘువీరా, ఊమెన్ చాందీలు సమావేశమయ్యారు. అనంతరం రఘువీరా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ మాతో వస్తే జగన్కు నొప్పి ఏమిటి?: చంద్రబాబు సంచలనం, జనసేనకు టీడీపీ ఆహ్వానం!
రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించామని చెప్పారు. 175 నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు రాహుల్ గాంధీకి వివరించామని చెప్పారు. పొత్తులు పెట్టుకోవాలా, లేక ఒంటరిగా పోటీ చేయాలా అన్నదానిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు.
మాతో పొత్తు పెట్టుకుంటే అధికారం
మా పార్టీతో (కాంగ్రెస్) పొత్తు పెట్టుకుంటే అధికారం ఖాయమని రఘువీరా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీలు కూటమిగా ఉన్నాయి. కాంగ్రెస్ దగ్గరకు వైసీపీ, జనసేనలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో రఘువీరా వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించే అంటున్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి అధికారం వస్తుందని ఆయన పరోక్షంగా సూచిస్తున్నారు.
మా పార్టీలోను పొత్తుకు నో చెప్పేవాళ్లు
కొందరు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు పొత్తుకు సుముఖంగా ఉన్నారని అధిష్టానం భావిస్తోంది. దీనిపై కూడా రఘువీరా స్పందించారు. తమ పార్టీలో కూడా పొత్తు కావాలి, పొత్తు వద్దు అనే నాయకులు ఉన్నారని చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్కు లాభమని చెప్పేవారు కూడా ఉన్నారని చెబుతున్నారు. తమ లక్ష్యం ప్రత్యేక హోదా అన్నారు. తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని కాగానే హోదా ఫైల్ పైన తొలి సంతకం పెడతారని చెప్పారు.
పొత్తు ఉంటుందా లేదా?
కాగా, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మరో రెండు పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడి తెలంగాణలో పోటీ చేశాయి. చంద్రబాబు కూడా రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లి కలిశారు. ఒకే వేదికపై పలుమార్లు కనిపించారు. దీంతో 2019లో టీడీపీ, కాంగ్రెస్ ఏపీలోను పొత్తు పెట్టుకుంటుందని దాదాపు తేలిపోయింది. కానీ అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్లో కొందరు నేతలు పొత్తుపై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఘువీరా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.