షాపు మల్లాది విష్ణు తల్లి పేరు మీద ఉంది, ఆయనకు లింక్ లేదు: కల్తీ మద్యంపై రఘువీరా
విజయవాడ: కల్తీ మద్యం సంఘటనతో తమ పార్టీ నాయకుడు మల్లాది విష్ణుకు ఏ విధమైన సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యం ఘటన దురదృష్టకరమని అన్నారు.
షాపు మల్లాది విష్ణు తల్లి పేరు మీద ఉందని ఆయన చెప్పారు. బాధితులకు రూ.10 లక్షల రూపాయలేసి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైనవారే నష్టపరిహారం చెల్లించేలా చట్టంలో మార్పులు తేవాలని ఆయన సూచించారు.
కల్తీ మద్యం కేసుపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు. బాధితులను ఆదుకోవడంపై కన్నా టిడిపి ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు. కల్తీ మద్యం ఘటనలో తప్పు యాజమాన్యానిదో, ఆబ్కారీ శాఖదో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
పదేళ్ల తమ కాంగ్రెసు పాలనపై విచారణ జరిపించాలనే తమ డిమాండ్ను తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.