జగన్ అధికారంలోకి వస్తారని భావించాం: రఘువీరా, టీడీపీతో పొత్తుపై..
అనంతపురం: గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని భావించామని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సోమవారం అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని చెప్పారు.
2014లో వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించామని, కానీ చివరి నిమిషంలో ఫలితాలు తారుమారు అయ్యాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు. తెలుగుదేశం, బీజేపీ వైఫల్యాలపై కరపత్రాలతో ఇంటింటికి ప్రచారం చేస్తామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరితోను పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటవుతున్నాయనే ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే.
దీనిపై రఘువీరా స్పందించారు. ఏ పార్టీతోను వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండదన్నారు. పొత్తులపై పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీదే తుది నిర్ణయం అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎవరితోనైనా కలిసి పని చేస్తామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేక శక్తులతో తాము పని చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.