దాడే, పోరాటం కాదు: టిడిపిపై రఘువీరా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీపై ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదరిక నిర్మూలనపై తెలుగుదేశం పార్టీ చేసేది పోరాటం కాదని, అది దాడి అని ఆయన అన్నారు. పేదరికాన్ని నిర్మూలించాల్సిన ప్రభుత్వం అర్హులైన పేదల రేషన్ కార్డులను, పింఛన్లను తొలగిస్తోందని ఆయన అన్నారు
జన్మభూమిలో పాల్గొని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన బుధవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకరించనివారిపై ప్రభుత్వం కక్ష కట్టిందని, వారి సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు.
అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, నిరుద్యోగ భృతి, రైతు, డ్రాక్రా, చేనేత రుణాల మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, పంటల భీమా, ఆదర్శ రైతు, ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి ఉపాధి కల్పించడం వంటి అంశాలను జన్మభూమి అజెండాలో చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.