పార్టీ వీడిన వారు పునరాలోచించుకోవాలి: రఘువీరా రెడ్డి
హైదరాబాద్: తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి చీఫ్ బాధ్యతలు అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రఘువీరా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పిసిసి చీఫ్ అనేది పదవి కాదని బాధ్యత అని చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినందున తనకు ఈ బాధ్యతలు ఇచ్చారని తెలిపారు.
తన అంగీకారాన్ని కాంగ్రెస్ అధిష్టానం అడిగినప్పుడు కార్యకర్తగా ఏ బాధ్యత ఇచ్చిన స్వీకరిస్తానని చెప్పినట్లు రఘువీరా రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా గత 25ఏళ్లో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏళ్ల తరబడి పదవులను అనుభవించిన కొందరు పార్టీని వీడటం బాధకరమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా మిగిలి ఉన్న కార్యకర్తలు, నాయకుల సహకారంతో సమన్వయంగా తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నానని రఘువీరా రెడ్డి తెలిపారు. 120ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలని చెప్పారు. కారణాలు ఏవైనా కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిన వారు పునరాలోచించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో అంతా బాగున్నప్పుడు మంచిన పంచుకున్నామని, ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో కొంత చెడు జరిగినా, నష్టం జరిగినా కలిసే పంచుకోవాలని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులు తిరిగి పార్టీలోకి రావాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని రఘువీరా రెడ్డి తెలిపారు.