వైసీపీ ఇలాకాలో రాహుల్ గాంధీ - జగన్ సీఎం అయ్యాక తొలిసారి..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీకి వచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఏపీలో ప్రవేశించారు. కర్ణాటకలో తన యాత్ర కొనసాగిస్తున్న యాత్ర ద్వారా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. డీ హరేల్ మండలంలో మారెమ్మ గుడి వద్ద కర్ణాటక-ఏపీ సరిహద్దులో ఆయన ఏపీలో ప్రవేశించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాధ్ తో పాటుగా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఆయనను ఆహ్వానించారు.
మూడు కిలో మీటర్ల మేర యాత్ర కొనసాగింది. మధ్నాహ్నం తరువాత ఓబులాపురం మీదుగా బళ్లారి దిశగా యాత్ర సాగనుంది. ఉదయం కర్ణాటక లోని కనుగుప్ప గ్రామం వద్ద రాహుల్ యాత్ర ప్రారంభమైంది. ఈ రోజు 12 కిలో మీటర్లు యాత్ర చేయనున్నారు. ఇదే సమయంలో..రాహుల్ ఏపీలో పార్టీ పరిస్థితి పైన నేతల నుంచి ఆరా తీసారు. 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత రాహుల్ తొలి సారి ఏపీకి వచ్చారు. అందునా వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో ఆయన యాత్ర కొనసాగుతోంది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు.
కాంగ్రెస్ కేడర్ మొత్తం వైసీపీకి తరలి పోయింది. ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ లో పదుల సంఖ్యలో మాత్రమే నేతలు కనిపిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు శైలజా నాద్.. కేవీపీ రామచంద్రరావు..పల్లంరాజు.. గిడుగు రుద్రరాజు.. కనుమూరి బాపిరాజు వంటి వారు మాత్రమే అప్పుడప్పుడూ కాంగ్రెస వాయిస్ వినిపిస్తున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూనమైన మాజీ మంత్రి రఘవీరా రెడ్డి ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర వరకు పాల్గొంటున్నారు. పార్టీ పరంగా క్రియాశీలకం అయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇక..చిరంజీవికి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావించినా..అందుకు మెగాస్టార్ ససేమిరా అన్నారు. ఆయన పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. ఇక, ఇప్పుడు రాహుల్ గాంధీ యాత్ర సమయంలో ఆయన్ను తొలి నుంచి అనుసరిస్తున్న కేడర్ ఎక్కువగా కనిపించింది.