రాహుల్ తో కలిసి బాబు : ఎన్నికల ప్రచారం కోసం కలయిక : ఏపిలో మాత్రం వేర్వేరు దారులు..!
మరోసారి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో..చంద్రబాబు కలుస్తున్నారు. కర్నాటకలో జెడిఎస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ పొల్గొంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసిన ఇద్దరు నేతలు అక్కడ వ్యతిరేక ఫలితాలు పొందారు. ఏపిలో వేర్వేరుగా పోటీ చేసిన ఒకరిపై మరొకరు ఎక్కడా విమర్శలు చేసుకోలేదు. ఇక, ఇప్పుడు మరోసారి ఇద్దరు కలిసి ప్రచారం చేస్తుండటంతో..ఈ సారైనా సానుకూల ఫలితాలు సాధిస్తారా..

రాహుల్..చంద్రబాబు కలిసి..
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ..టిడిపి అధినేత చంద్రబాబు మరో సారి ఒకే వేదిక మీదకు వస్తున్నారు. అందుకు కర్నాటక వేదిక కానుంది. కొద్ది కాలం నుండి ఇద్దరూ మిత్రులుగా ఉంటున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో మొదలైన ఈ బంధం ఏపి మినహా కర్నాటక వరకు కొనసాగింది. కర్నాటకలో ఇప్పటికే మండ్యాలో సుమలతకు వ్యతిరేకంగా..జెడిఎస్ అభ్యర్దికి మద్దతుగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేసారు. మలి విడత ప్రచారంలో భాగంగా రాయచూర్ ప్రచారంలో ఈ ఇద్దరూ కలిసి పాల్గొంటారు. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అభ్యర్థి నాయక్కు ఓటు వేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు. రాయచూరు, కొప్పల లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. ప్రధానంగా అక్కడ ఎక్కువగా ఉండే తెలుగు ప్రజలను ఆకట్టుకోవటానికి చంద్రబాబు ఆ ప్రాంతం పై గురి పెట్టారు.

తెలంగాణలో దోస్తీకి వ్యతిరేకంగా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి సారిగా కాంగ్రెస్..టిడిపి పొత్తు పెట్టుకొని అక్కడ కలిసి పోటీ చేసారు. రాహుల్ గాంధీ.. చంద్రబాబు కలిసి అనేక వేదికల ద్వారా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఖచ్చితంగా ఈ కూటమికి సానుకూల ఫలితాలు వస్తాయని ఆశించారు. సరిగ్గా ఇదే పొత్తును కేసీఆర్ తనకు అనుకూలగా మలచుకున్నారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు లక్ష్యంగా కేసీఆర్ చేసిన విమర్శలను తిప్పి కొట్టటంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో కేసీర్ ఏకపక్షంగా గెలిచారు. ఇక, ఆ ఫలితాలతో ఏపిలో పొత్తు కొనసాగించాలా వద్దా అనే తర్జన భర్జనల తరువాత ఆ నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేసారు. బాబు నిర్ణయం మేరకు విడివిడిగా పోటీ చేసారు. ఇప్పుడు తిరిగి కర్నాటలో మాత్రం కాంగ్రెస్-జేడీఎస్ కుటమి అభ్యర్దికి మద్దతుగా ఈ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు.

ఏపిలో ఒక్క విమర్శ లేకుండా..
ఏపి ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రచారం చేసారు. సభల్లో పాల్గొన్నారు. ఆ ప్రచారంలో బిజెపి..వైసిపి మీద విమర్శలు చేసిన రాహుల్ ఎక్కడా ఏపిలో అయిదేళ్ల చంద్రబాబు పాలన మీద మాత్రం ఒక్క విమర్శ చేయలేదు. ఇక, చంద్రబాబు సైతం ప్రధాని మోదీ..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేసారు. ఏ సభ లోనూ కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క ఆరోపణ చేయలేదు. కాంగ్రెస్ ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానందంటూ ఆ పార్టీకి మద్దతుగా చంద్రబాబు కొన్ని చోట్ల ప్రస్తావించారు. ఇక, ఇప్పుడు ఏపిలో ఎన్నికలు పూర్తి కావటంతో ఇద్దరు తిరిగి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో మాత్రమే తమ పొత్తు అని చెబుతున్న ఇద్దరు నేతలు మోదీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అయితే, ఏపి లో ఒక రకంగా..మిగిలిన ప్రాంతాల్లో ఒక విధంగా సాగుతున్న ఈ మైత్రి పై అనేక రకాల విశ్లేషణలు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications