ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: రాహుల్ గాంధీ వైఖరి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన విమర్సించారు. న్యూఢిల్లీలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని గత యుపిఎ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యోక హోదా ఇచ్చే సమయం వచ్చిందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు తమ కాంగ్రెసు పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనలో రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై మాట్లాడిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యోక హోదా సాధించే విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వైఖరిని రాహుల్ గాంధీ తప్పుపట్టారు.