మూడు రాజధానులు కరెక్ట్ కాదు-పొత్తులపై కొత్త అధ్యక్షుడిదే నిర్ణయం-రాహుల్ కామెంట్స్
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఇవాళ కర్నూల్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరామంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు రాహుల్ సమాధానాలిచ్చారు. ముఖ్యంగా ఏపీలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, విభజన హామీలు, రాజధానుల వ్యవహారం, భారత్ జోడో యాత్ర పంటి అంశాలపై రాహుల్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై వస్తున్న విమర్శలపై రాహుల్ స్పందించారు. శశిథరూర్ ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కమిటీ ఛైర్మన్ మథుసూధన్ మిస్త్రీ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని తాను భావిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. తమ పార్టీలో మాత్రమే ఇది సాధ్యమన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఇతర పార్టీల్ని ఇవే ప్రశ్నలు ఎందుకు అడగరని ఎదురు ప్రశ్నించారు. ఇది భారత్ జోడో యాత్ర కాదని ఎన్నికల యాత్ర మాత్రమేనని వస్తున్న విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు.
ఏపీలో పొత్తులపై రాహుల్
గతంలో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఆ పొత్తు కొనసాగుతుందా లేక కొత్త పొత్తులు పొడుస్తాయా అన్న ప్రశ్నకు రాహుల్ స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై నిర్ణయంతీసుకోవాల్సింది తాను కాదని, ఇక్కడి కాంగ్రెస్ నేతలే అన్నారు. తమ పార్టీలో ఆ విధమైన పద్ధతి ఉందని రాహుల్ తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ మద్దతు తీసుకుంటారా అన్న ప్రశ్నకు సైతం కొత్తగా ఎన్నికయ్యే కాంగ్రెస్ అధ్యక్షుడు దీనిపై నిర్ణయం తీసుకుంటారని రాహుల్ తెలిపారు.
అమరావతికే కాంగ్రెస్ మద్దతు
తమకు మూడు రాజధానులఉద్దేశం లేదని, ఒకే రాజధాని ఉండాలని కోరుకున్నామని రాహుల్ తెలిపారు. అది అమరావతిగానే ఉండాలని కోరుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని రాహుల్ పేర్కొన్నారు. వారికి మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నామని, వారి తరఫున పోరాడతామని రాహుల్ తెలిపారు. తాను గతంలోకి పోదలచుకోలేదని, కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంపైనే తాము దృష్టిసారిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలంటే?
కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రతీ పౌరుడికీ, కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రాతినిధ్యం వహిస్తోందని రాహుల్ తెలిపారు. అలాగే ఓ బాధ్యత గల పార్టీగా ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాహుల్ వెల్లడించారు. తమలా వైసీపీ, టీడీపీ, బీజేపీ ఇలా ఏ పార్టీ కూడా ఎన్నికలు నిర్వహించలేదన్నారు.
అలాగే తాను ఏ బాధ్యత చేపట్టాలన్నది కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు నిర్ణయిస్తారని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ లో ఏ నిర్ణయం తీసుకునే హక్కయినా అధ్యక్షుడికి మాత్రమే ఉంటుందన్నారు. ఖర్గే,థరూర్ ఇద్దరూ సీనియర్లని, అనుభవజ్ఞులని వారిలో ఎవరు ఎన్నికైనా వారు తమంతట తాము నిర్ణయాలు తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీకి జర్నలిస్టుల్ని ఎదుర్కొనే ధైర్యం ఉందని, వాస్తవాలు మాట్లాడే ధైర్యం ఉందని, కానీ ప్రధాని మోడీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా, జర్నలిస్టుల్ని ఎదుర్కొన్నారా అని రాహుల్ ప్రశ్నించారు.