ప్రత్యేక హోదాపై జగన్, చంద్రబాబులను ఏకేసిన రాహుల్ గాంధీ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను సాధించడంలో విఫలమయ్యారంటూ, వాటి సాధన కోసం పోరాటం చేయడంలో విఫలమయ్యారంటూ, ప్రధాని మోడీకి భయపడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వారి పేరు ప్రస్తావివించకుండా ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
ఈ గ్రామంలో ఇందిరమ్మ ప్రసంగించారని, ఈ చోటు నుంచే పేదలకు భరోసా ఇచ్చారని, ఇందిరమ్మ మనువడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ప్రజా సమస్యల విషయంలో తమ పార్టీ రాజీ పడేది లేదని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు గ్రామంలో ఆయన శుక్రవారం రైతులను, చేనేత కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం అశ్చర్యకరమైన రీతిలో వ్యవహరిస్తోందని, ఎపికి ప్రత్యేక హోదా కోసం ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎందుకు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం లేదని, ఎందుకు మోడీకి భయపడుతున్నారని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదాపై, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై టిడిపి, వైసిపి పార్టీలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. తాము ఎవరికీ భయపడే స్థితిలో లేమని, అందుకే తాము ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు. తమ పార్టీ ప్రత్యేక హోదా కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం తమ పార్టీ పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
పేదల కన్నీళ్లు తుడిచేందుకే తాను ఇక్కడికి వచ్చానని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. రైతులు, చేనేత కార్మికుల కన్నీళ్లు తుడిచేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెస్తున్న భూసేకరణ బిల్లుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే భూసేకరణ చట్టాన్ని మార్చి, రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు.
అధికారంలోకి రాగానే భూసేకరణ చట్టంలో మోడీ మార్పులు చేసి, రైతుల భూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని, దానికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. రైతులకు, పేదలకు భరోసా ఇవ్వనప్పుడు ఈ దేశం ఎందుకని ఆయన అన్నారు. ఇందిరమ్మ సంస్కారం తన నరనరాల్లో జీర్ణించుకుని ఉందని, ఆమె మనవడిగా తాను పేదల కన్నీళ్లు తుడవడానికి పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ఈ వేదిక నుంచే ఇందిరమ్మ మాట్లాడారని, అదే వేదిక నుంచి ఇందిరమ్మ మనవడిగా ప్రజల తరఫున పోరాటం చేస్తానని భరోసా ఇస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు.