'ఫిబ్రవరి 2న ఏపీకి రాహుల్ గాంధీ', రైల్వే బడ్జెట్పై సీఎంకు నివేదిక: సుజనా
అమరావతి: కాంగ్రెస్ పార్టీపై ద్వేషంతో అప్పట్లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నీరుగారుస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక ఫిబ్రవరి 2వ తేదీన అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నిర్వహించనున్న కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ హాజరవుతారని ఆయన తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ దశలవారీగా ఉద్యమం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కొత్త టెక్నాలజీకి ప్రయత్నాలు చేస్తున్నాం: సుజనా చౌదరి
నీతి ఆయోగ్ రిపోర్టుపై ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కలుస్తారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు వాతావరణ సమాచారాన్ని అందించేందుకు కొత్త టెక్నాలజీ కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు.
రైతుల్లో నైపుణ్యాభివృద్ధి పెంచడానికి రాష్ట్రంతో కలిసి కేంద్రం పనిచేస్తుందని ఆయన చెప్పారు. దేశంలో తుఫాన్లను ఆపడం సాధ్యం కాదని, అయితే తుఫాన్ ముందస్తు సమాచారాన్ని అందించవచ్చని ఆయన తెలిపారు. డ్రోన్ల వ్యవస్థతో కరువును అంచనా వేయవచ్చని ఆయన చెప్పారు.
ఏపీలోని ఎంపీలందరి తరపున రైల్వే బడ్జెట్పై సీఎంకు నివేదక ఇస్తామని పేర్కొన్నారు. పోలవరం బాధ్యత కేంద్రానిదే ఆయన స్పష్టం చేశారు.