హైదరాబాద్ ఎవరి సొంత జాగీరూ కాదు: రాహుల్
అనంతపురం: హైదరాబాదు ఎవరి సొంత జాగీరూ కాదని, హైదరాబాద్ అందరిదని కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాదులో సీమాంధ్రులపై ఈగ వాలకుండా చూసే బాధ్యత తమదని ఆయన హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన బుధవారం ప్రసంగించారు.
హైదరాబాద్పై సీమాంధ్రులకు అన్ని రకాల హక్కులూ ఉన్నాయని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు తాము సానుకూలంగా ఉన్నట్లు రాహుల్ చెప్పారు. 100 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగదారులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని వాగ్దానం చేశారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే నిర్మిస్తుందని ఆయన అన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా గుర్తిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే సీమాంధ్ర ప్రజలకు మూడు హక్కులు కల్పిస్తామని చెప్పారు. రైతులకు రెండు లక్షథల రూపాయల మేర రుణమాఫీ చేస్తామని చెప్పారు. పేదవాళ్లకు సొంతిల్లు, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
తమ అందరి పట్టుదల వల్లనే సీమాంధ్రకు ప్రత్యేక హోదా వచ్చిందని చెప్పారు. ఇందిరమ్మను అమ్మా అంటూ అక్కున చేర్చుకున్న ప్రాంతం ఇది అని ఆయన అన్నారు. ఆంధ్రలో విద్యాసంస్థల అంశాన్ని బిల్లులో పెట్టినట్లు తెలిపారు. హైదరాబాదులోని విద్యాసంస్థల్లో ఉన్న ప్రస్తుత కోటా కొనసాగుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే తమకు ఎంతో అభిమానమని రాహుల్ గాంధీ చెప్పారు. తమ పార్టీ ప్రజాభిప్రాయానికి విలువ ఇస్తుందని చెప్పారు. సీమాంధ్ర ప్రజల కోసమే సోనియా గాంధీ పదేళ్ల పాటు రాయితీలు కల్పించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు రాజధానిని ఆరు నెలల్లో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అంకం ముగిసిందని, ఇప్పుడు సీమాంధ్రను ఎలా అభివృద్ధి చేయాలనేదే తమ ఆలోచన అని రాహుల్ గాంధీ చెప్పారు.