రూ.4వేల జీతం, ఇంట్లో బంగారు కిరీటాలు: డైరీ చైర్మన్ అవినీతి లీలలు!
విశాఖ: విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీ రావు కుటుంబ సభ్యుల ఆస్తులు కోట్లలో ఉన్నట్లు ఐటీ తనిఖీలలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. అడారి జీతం రూ.4 వేలు. కానీ ఆయన కుటుంబ సభ్యుల పేరిట మాత్రం పెద్ద మొత్తంలో ఆస్తులను ఐటీ గుర్తించిందని తెలుస్తోంది.
ఆదాయపన్ను శాఖ విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసిరావు, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తులసిరావు తనయుడి లాకర్లో బంగారు కిరీటాన్ని గుర్తించారని తెలుస్తోంది. కూతురు రమాకుమారి లాకర్లో మరో బంగారు కిరీటం ఉంది. అది అమ్మవారిదిగా చెబుతున్నారు.
తులసిరావు వద్ద కిలోకు పైగా బరువున్న బంగారు కిరీటం లభించగా, కూతురు వద్ద బంగారు కిరీటంతో పాటు మరిన్ని బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. పెద్ద కొడుకు ఆనంద్ పేరుతో హైదరాబాద్, బెంగళూరు, విశాఖలలో పలు ప్లాట్లు, భూములు, రెండో కొడుకు సంతోష్ పేరుతో భూములు గుర్తించారు.
గత మంగళవారం చైర్మన్ ఆస్తుల పైన ఐటీ అధికారులు దాడులు చేశారు. వారి దాడులలో పలు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయని వార్తలు వస్తున్నాయి.
డెయిరీకి అనుబంధంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేశారని, దానిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్నారని చైర్మన్ పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు. డెయిరీ కోసం అనేక యంత్రాలను విదేశాల నుంచి సెకండ్ హ్యాండులో కొనుగోలు చేశారని, తద్వారా లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటున్నారు.
తూగో జిల్లా రంగంపేటలో పౌడర్ ప్లాంట్ కోసం ఆస్ట్రేలియా నుంచి యంత్రాలను దిగుమతి చేసుకున్నారని, వాటిని చాలా కాలం పాటు గోడౌన్కే పరిమితం చేశారని, ఈ క్రమంలో రూ.16 లక్షలు డెమరేజ్ కింద పోర్టుకు చెల్లించినట్లుగా తెలుస్తోందని అంటున్నారు.
ఆటో నగర్లో పనికి రాదని చెప్పినా రూ.2.5 కోట్లతో గోడౌన్ కొనుగోలు చేశారని, అది చాలాకాలం నిరుపయోగంగా ఉందని అంటున్నారు.
పాలు సరఫరా చేసే వ్యాన్లు, లారీలు, ట్యాంకర్ల వినియోగంలో బినామీల హవా నడుస్తోందని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. టెండర్లు లేకుండా రూ.కోట్ల విలువైన పనులు ఇచ్చారని, వాటిల్లో అవకతవకలి జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాదులో అవసరం లేకపోయినా సేల్స్ పాయింట్ పెట్టి మిల్క్ ప్రాసెసింగ్ పేరిట రూ.లక్షలు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఓ ఐస్ క్రీం సంస్థతో ఉన్న లింకుల పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా చైర్మన్ బంధువులకు చెందినదిగా చెబుతున్నారు. ట్రస్ట్ పేరిట అక్రమాలకు పాల్పడుతున్నా, దాని పైన ఫిర్యాదు చేసినా వాటిని పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు.