ట్రైన్ జర్నీలో ఇబ్బంది ఎదురైతే ఇలా చేయండి
రైలు అనేది భారతీయుల జీవనంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 67వేల కిలోమీటర్లకు పైగా నెట్ వర్క్ ఉన్న సంస్థగా నాలుగో స్థానంలో నిలిచింది. రైలు ప్రయాణాన్ని ప్రతి భారతీయుడు ఇష్టపడతారు. నిత్యం కొన్ని లక్షల మంది రైల్వే గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ప్రయాణం చేసే సమయంలో కొందరు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయి.
రైళ్లల్లో సౌకర్యాలు లోపించడం, తోటి ప్రయాణికుల అసభ్య ప్రవర్తన, రెస్ట్ రూముల్లో నీరు ఆగిపోవడం, రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇటువంటి సమస్యలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు ఫిర్యాదు చేయవచ్చు. జర్నీలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ చాలామంది పట్టించుకోరు. కొంతమందికి ఎవరిని కలవాలి? ఎలా ఫిర్యాదు చేయాలి? అనే విషయాలపై అవగాహన ఉండదు. కొంతమందికైతే ఫిర్యాదు చేయాలని కూడా తెలియకపోవచ్చు.

అయితే దీనికోసం IRCTC ఒక అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రయాణంలో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా సంస్థ చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తుంది. ఫిర్యాదు చేసేటప్పుడు మూడు కీలకమైన అంశాలకు ప్రాధాన్యత ఉంది. టికెట్ నెంబరు, ఓటీపీ కోసం మొబైల్ నెంబర్, ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోకానీ, వీడియోకానీ తప్పనిసరిగా ఉండాలి.
స్మార్ట్ఫోన్లో RailMadad యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. హోమ్పేజీలోకి వెళ్లి కుడివైపు ఉన్న ట్రైన్ కంప్లైంట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. వెరిఫికేషన్ కోసం ఫిర్యాదు చేసేవాళ్లు తమ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఫోన్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తరువాత PNR నెంబర్ ఎంటర్ చేసి ఫిర్యాదును ఎంపిక చేసుకోవాలి. అలాగే ఏ విషయానికి సంబంధించి ఫిర్యాదు చేస్తున్నారో అందుకు సంబంధించిన ఫొటోను అప్ లోడ్ చేయాలి. ఎదురైన ఇబ్బంది గురించి వివరణ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత సబ్ మిట్ కొట్టాలి. అనంతరం ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి రిజిస్టర్ ఫోన్ కు మెసేజ్ రూపంలో కోడ్ వస్తుంది. ఫిర్యాదు ఎంతవరకు వచ్చింది? ఎలా దర్యాప్తు సాగుతోంది? తదితర విషయాలు తెలుసుకునేందుకు భవిష్యత్తులో ఈ కోడ్ ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications