ఏపీ పంట పండింది... నరేంద్రమోడీ కొత్త ప్రాజెక్టు?
కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలే ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి త్వరత్వరగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులకు ఎటువంటి జాప్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తోంది. ఇలా ఎన్నో ప్రాజెక్టులు కార్యరూపం దాల్చుతున్న తరుణంలోనే మరో కొత్త ప్రాజెక్టు ఏపీకి రాబోతోంది. మచిలీపట్నం నుంచి రేపల్లెకు కొత్తగా రైల్వే లైను నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిశారు.
సరకు రవాణాతో లాభం
రైల్వే లైను ఏర్పాటు చేయడంవల్ల ఎటువంటి లాభాలు ఒనగూరుతాయి? ఏయే ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది? విజయవాడ రైల్వేస్టేషన్ పై ఒత్తిడి ఎలా తగ్గుతుంది? సరకు రవాణావల్ల ఎటువంటి లాభాలున్నాయి? మచిలీపట్నం నుంచి రొయ్యలు, చేపలు చెన్నైకి రవాణా చేయడానికి ఏవిధంగా మార్గం సుగమం అవుతుంది?... తదితర విషయాలను విడమరిచి చెప్పారు. ఒక ప్రాజెక్టు రిపోర్టుతో ఎంపీ మంత్రిని కలిశారు. మచిలీపట్నం నుంచి తెనాలి వెళ్లాలంటే గుడివాడ, విజయవాడ మీదగా 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అలా కాకుండా ఈ ప్రాజెక్టు రావడంవల్ల కేవలం 45 కిలోమీటర్ల దూరంతోనే చేరుకోవచ్చన్నారు. తెనాలి చెన్నైవైపు, విజయవాడవైపు కీలక మార్గంలో ఉందనే విషయాన్ని చెప్పారు.

ఎంపీకి లేఖ రాసిన రైల్వే మంత్రి
రైల్వే లైను నిర్మాణ సాధ్యాసాధ్యాలను తెలుసుకొని అవసరమైన వనరులను సమకూరుస్తానని మంత్రి తర్వాత ఎంపీకి లేఖ రాశారు. దీన్నిబట్టి త్వరలోనే రైల్వేలైను పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గతంలో అధికారులు మచిలీపట్నం-ధర్మవరం రైలును రద్దు చేశారని, ఇది తిరుపతి మీదుగా ప్రయాణించేదని, దీన్ని పునరుద్ధరించాలని ఎంపీ కోరుతున్నారు.
అయితే గతంలో కూడా ఇదే విషయాన్ని ఎంపీ కోరగా మచిలీపట్నం నుంచి తిరుపతి వరకు రైలును నడిపిస్తున్నారు. అలా కాకుండా ధర్మవరం వరకు నడిపించాలని ఎంపీ పట్టుబడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మచిలీపట్నం నుంచి నడుస్తున్న రైళ్లను వడ్లమన్నాడు, చిలకలపూడి స్టేషన్లలో నిలిపేలా అనుమతించాలని కూడా కోరుతున్నారు. కొత్త రైల్వే లైను వల్ల మచిలీపట్నం నుంచి విజయవాడకు 100 కిలోమీటర్లు తగ్గడంతోపాటు విజయవాడ జంక్షన్ పై ఒత్తిడి తగ్గుతుంది.












Click it and Unblock the Notifications