తెలుగు రాష్ట్రాల మీదుగా హైదరాబాద్ - బెంగళూరు వందేభారత్ సిద్దం..!!
తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ సిద్దం అవుతోంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. మూడు నెలల సమయంలో రెండు వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మూడో వందేభారత్ రైలు ప్రారంభం పై కసరత్తు మొదలైంది. రెండు ఐటీ నగరాల మధ్య వందేభారత్ పట్టాలెక్కనుంది. కాచిగూడ నుంచి బెంగళూరు మధ్య వందేభారత్ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీని ద్వారా ఏడు గంటల్లోనే బెంగళూరు చేరుకొనే అవకాశం కలుగుతుంది.
సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లకు అంచనాలు మించి ఆదరణ లభిస్తోంది. మరో రెండు రైళ్లను సికింద్రాబాద్ నుంచి ప్రారంభించేందుకు రైల్వే శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కాచిగూడ - బెంగళూరు, సికింద్రబాద్ - పూణే మధ్య కొత్త రైళ్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రస్తుతం కాచిగూడ - బెంగళూరు మధ్య వందేభారత్ కోసం రూటు సర్వే పూర్తి చేసారు. జూన్ తొలి వారంలో ఈ రైలును ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు దీనికి సంబంధించిన రూటు మ్యాప్..ట్రయిల్ రన్ గురించి నివేదిక పంపారు. దీనికి వచ్చే వారం ఆమోదం లభించే అవకాశం ఉంది.

రెండు ఐటీ సిటీల మధ్య వందేభారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ఈ రెండు సిటీల మధ్య రైల్వే ప్రయాణానికి ప్రస్తుతం 11 గంటల వరకు సమయం పడుతోంది. వందేభారత్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం 7 గంటల్లో గమ్యస్థానం చేరుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా బెంగళూరు చేరుకొనేలా రూట్ ఖరారు చేసారు.ట్రాక్ సామర్ధ్యం, రైలు వేగంపై రైల్వే అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. రూట్ షెడ్యూల్ పైన దాదాపు క్లారిటీ రావటంతో, టైమింగ్స్ పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా దేశ వ్యాప్తంగా 75 వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
ఇప్పటికే సికింద్రాబాద్-బెంగళూరు మధ్య సుమారు ఏడు రైలు సర్వీసులు పరుగులు పెడుతున్నాయి. నిత్యం ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. ఈ లైన్ లో ఉన్న డిమాండ్ కారణంగా వందేభారత్ ఏర్పాటు చేయటం ద్వారా ఆదరణ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు వారాంతంలో ఈ రూటులో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ రైలుతో పాటుగా సికింద్రాబాద్ - పూణే మధ్య వందేభారత్ ప్రారంభానికి అధికారులు సిద్దం అవుతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసేందుకు రైల్వే అధికారులు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications