విశాఖ గోడు: వానతో సహాయక చర్యలకు గండి
విశాఖపట్నం: హుధుద్ తుఫాను తాకిడికి రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతున్న విశాఖపట్నం నగరం కష్టాలు తీరేట్లు లేవు. శనివారం సాయంత్రం విశాఖపట్నంలో వర్షం ప్రారంభమైంది. దీంతో తుఫాను సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. విద్యుత్తు పునరుద్ధరణ పనులు ఆగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం పట్టు విడవని విక్రమార్కుడిలా సాధ్యమైనంత త్వరగా ప్రజలను తుఫాను వేదన నుంచి బయటపడేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వర్షంలోనే ఆయన సహాయచర్యల క్షేత్ర స్థాయి పరిశీలనకు బయలుదేరారు.
తుఫాను తాకిడికి విరిగి పడిన చెట్లను తొలగించే పని కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. హుధుద్ తుఫాను తాకిడికి విశాఖపట్నం విమానాశ్రయం పైకప్పు ఎగిరిపోయింది. అయితే, ఇటీవలే దేశీయ విమానాలు ఈ విమానాశ్రయం నుంచి ప్రారంభమయ్యాయి.
విశాఖ నగరాన్ని పూర్తిగా పునర్మించాల్సిందేనని నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) సీనియర్ అధికారులు అనేంతగా నష్టం వాటిల్లింది. ఆదివారంనాడు ఉక్కు నగరాన్ని తుఫాను తీవ్రంగా తాకింది. ఆ తర్వాత గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విచాయి. భారీ వర్షం కురిసింది. దీంతో విశాఖ నగరం తుక్కుతుక్కు అయింది. విశాఖనగరం 70 నుంచి 80 శాతం వరకు ధ్వంసమైందని అంచనా వేసినట్లు ఎన్డిఆర్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ గులేరియా అన్నారు.
చాలా మంది ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. టెలిఫోన్ లైన్స్ కూడా తెగిపోయాయి. కలెక్టర్ కార్యాలయానికి కూడా టెలిఫోన్ సౌకర్యం లేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా శనివారం సాయంత్రం నుంచే విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. ఆ తర్వాత తుఫాన్ విద్యుత్తు వ్యవస్థను తన్నేసింది. విశాఖపట్నం, శ్రీకాకుళంల్లో వదంలాది విద్యుత్తు స్తంభాలు, టవర్లు నేలకూలాయి.
సోమవారం ఉదయం లేచేసరికి ప్రజలకు కూలిన చెట్లు, విరిగిన విగ్రహాలు, కూలిన విద్యుత్తు, టెలిఫోన్ స్తంభాలు కనిపించాయి. నిత్యావసర సరుకుల కోసం కూడా విశాఖలో రోడ్లపై నడవలేని స్థితి ఏర్పడింది. నష్టం పూర్తి అంచనా ఇంకా వేయాల్సే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాడార్స్ పనిచేయ లేదు.