ఏపీలో తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలలో మోస్తరు వర్షాలు.. ఎక్కడెక్కడంటే!!
తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్ ప్రారంభమై నెలరోజులు గడిచినా ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో రాష్ట్రంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా జనాలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఇక రైతులు ఏరువాక సాగటానికి కావాల్సిన వర్షం పడకకోవటం రైతులను సైతం నిరాశకు గురి చేసింది. దీంతో వర్షాల కోసం ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఏపీలో వర్షాలు
అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు కురవకున్నా, వరుసగా మూడు నాలుగు రోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే 24 గంటలలో కోస్తా, రాయలసీమలో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ జిల్లాలలో మోస్తరు వర్షం
దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలోనూ, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలలో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ జిల్లాలలో నేడు తేలికపాటి వర్షం పడే ఛాన్స్
ఇక రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, పల్నాడు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం వర్షాలు కురిశాయి. కోస్తాంధ్ర రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
అరేబియా సముద్రంలో ద్రోణితోనూ వర్షాలు
మరోవైపు కేరళ నుంచి గుజరాత్ వరకు తీరం వెంబడి విస్తరించిన ద్రోణి కారణంగా అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో కూడా ఏపీకి వర్ష సూచన ఉందని వారావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications