ఏపీలో మూడురోజులు వర్షాలే.. మేఘాలకు ఆజ్ఞ వేసిన బంగాళాఖాతం!
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న మూడు రోజులు పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఏపీలో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవగా, మరో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఓవైపు నైరుతి రుతుపవనాలు విస్తరణ మరోవైపు జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా రానున్న మూడురోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు
ఏపీ లోని కొన్ని ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రంలో గాలుల వేగం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఈ కారణంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వచ్చే శనివారం మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని తెలిపింది.
ఏపీలో నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఇదిలా ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో వర్ష సూచన ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని పేర్కొంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
వర్షాలపై అధికారులు అలెర్ట్
ఇప్పటికే కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్షాల దెబ్బకు రైతులు పంట నష్టపోయారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఏపీలో ఇప్పటివరకు విస్తారంగా వర్షాలు కురవని కారణంగా రైతులు వర్షాల కోసం నిరీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications