ఆ పత్రికకు కౌంటర్: ఏపీ-టీ సమానం, మమ్మల్ని లాగొద్దని రాజ్భవన్
హైదరాబాద్: తాము రాజ్యాంగబద్ధంగా పని చేస్తున్నామని, నిష్పాక్షికంగా విధులు నిర్వహిస్తున్నామని రాజ్ భవన్ శనివారం తెలిపింది. ఏ నిర్ణయమైనా చట్ట పరిధిలోనే తీసుకుంటామని పేర్కొంది. శనివారం ఈ మేరకు గవర్నర్ మీడియా కార్యదర్శి ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలుగు రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నామని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. విధుల నిర్వహణలో రాష్ట్రాల మధ్య వివక్షచూపడం లేదని పేర్కొన్నాయి. రాజ్యాంగబద్ధంగా పని చేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, సలహాదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామని, ఎలాంటి పక్షపాతం లేకుండా వివాదాలకు దూరంగా పని చేస్తున్నట్లు వివరించింది.

రాజ్ భవన్ అత్యున్నత రాజ్యాంగబద్ధ కార్యాలయమని, నిష్పక్షపాతంగా, రాజ్యాంగానికి లోబడి పని చేస్తోందని, దీనిని అనవసర వివాదాల్లోకి లాగవద్దని, అది సరికాదని చెప్పింది. రాష్ట్రపతి పాలన సమయంలో సంబంధింత శాఖల అభ్యర్థనలు, అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకున్నామని, దీనిపై సమగ్ర పరిశీలన జరిగిందన్నారు.
అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సలహాదారుల సూచనలు, సలహాల మేరకు గవర్నర్ నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలను ఒక్క గవర్నర్కే ఆపాదించడం సరికాదని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించాలనే నిర్ణయం గవర్నర్ నరసింహన్ ఫిట్టింగ్ అంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి ఓ వార్తాకథనాన్ని ఇటీవల ప్రచురించిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రచురితమైన ఆ వార్తాకథనం తీవ్ర చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications