రాజమండ్రి ఇక రాజమహేంద్రవరం, అదే బాధిస్తోంది: తొక్కిసలాటపై బాబు
రాజమహేంద్రవరం: రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు ప్రకటించారు. గతంలో ఈ పేరే ఉందని, బ్రిటిష్ వాళ్లు తాము పిలుచుకోవడానికి వీలుగా రాజమండ్రిగా మార్చారని, దానిని మళ్లీ మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు.
గోదావరి ఆది పుష్కరాలు ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం నగరాన్ని రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా చేస్తానని చెప్పారు. ధవళేశ్వర్ బ్యారేజీ చుట్టూ 35 కిలోమీటర్ల ప్రాంతాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టుతో అభివృద్ధి చేస్తామన్నారు.
అందుకోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలోని అన్ని చారిత్రక ఆనవాళ్లను భవిష్యత్తు తరాల కోసం కాపాడుతామని చెప్పారు. కళలకీ, సంస్కృతికీ రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరం పేరుని పునరుద్ధరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
రాజమండ్రి నగరవాసులు ఇప్పటికీ చారిత్రకమైన రాజమహేంద్రవరం అన్న పేరుని వింటే పులకించిపోతారన్నారు. రాజమహేంద్రవరాన్ని ఆధునిక నగరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడివాళ్లు ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కడివాళ్లో ఇక్కడికే వచ్చేలా చేస్తామన్నారు.
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ఉద్యోగులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. రాజమండ్రి నగరాన్ని సాంస్కృతిక రాజధానిగా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు మొదలవుతాయి.
వీటీ కళాశాల, టౌన్హాల్, దామెర్ల రామారావు ఆర్ట్గ్యాలరీ, గౌతమి గ్రంథాలయాలను అభివృద్ధి చేసి రాబోయే తరాలకు వారసత్వ సంపదగా ఇవ్వాలన్నదే తన ఆలోచన అని, కేంద్ర కారాగారం దగ్గర ఉన్న 50 ఎకరాలను పర్యటక రంగానికి అనుగుణంగా తీర్చిదిద్ది కన్వెన్షన్ సెంటర్, హోటళ్లు, వినోద కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
రాజరాజ నరేంద్రుడికి ఈ రోజు నివాళులర్పించానని, అలాంటి నాయకుడు అవసరమన్నారు. అల్లూరి సీతారామరాజు, వీరేశలింగం, పొట్టి శ్రీరాములునీ స్ఫూర్తిగా తీసుకోవాలని, ఎన్టీఆర్ పేరు తలచుకోగానే ఎక్కడి లేని చైతన్యం వస్తుందన్నారు. తెలుగుజాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు నిలిచే ఉంటుందన్నారు.
మొదటి రోజు ఘటనపై...
గోదావరి పుష్కరాల తొలి రోజున చోటు చేసుకొన్న దుర్ఘటన ఇప్పటికీ ఎంతో బాధిస్తోందని, తన హయాంలో జరగడం బాధాకరమని, విధిని ఎవరూ తప్పించలేకపోయామని, పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడంలో అన్ని శాఖలూ ఎంతో కష్టపడ్డాయన్నారు.
యాత్రికులకు ఎలాంటి కష్టం లేకుండా చూశామని, ఏయే శాఖ పనితీరు ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకొన్నామని, మున్సిపల్, ఆరోగ్య, అగ్నిమాపక, పోలీస్, దేవాదాయ, విద్యుత్ ఇలా అన్ని శాఖలూ తమ బాధ్యతలు చక్కగా నిర్వర్తించాయన్నారు.
రాజమండ్రి వీధుల్నీ, గోదావరి స్నానఘట్టాలను అద్దంలా ఉంచారని, పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ఒకటిన్నర డీఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నామని, 4.81 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారని, గోదావరి వాళ్లు మంచివాళ్లన్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లకు ఆతిథ్యం ఇవ్వాలన్న పిలుపునకు చక్కటి స్పందన వచ్చిందన్నారు. వాళ్లు యాత్రికులకు చేసిన సేవలను ఎప్పటికీ మరిచిపోలేనని, జైన్ సంఘం వాళ్లు వేడివేడి రోటీలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా యంత్రాన్ని తెప్పిస్తే, ఆర్యవైశ్య సంఘంవాళ్లు పలు చోట్ల అన్నదానం చేశారన్నారు.
గత పుష్కరాలు (2003) తన హయాంలో జరగడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. వచ్చే ఏడాది కృష్ణా నది పుష్కరాలు కూడా ఇదే స్ఫూర్తితో నిర్వహిస్తామన్నారు. గోదావరి-కృష్ణా, గోదావరి-పెన్నా నదులను అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తామన్నారు.