తప్పు చేయలేదు, కెసిఆర్ దైవసమానం: రాజయ్య
హైదరాబాద్: ఏసు ప్రభువును నమ్మినబిడ్డగా చెబుతున్నానని, తాను ఏ తప్పూ చేయలేదని, చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య స్పష్టం చేశారు. కొంత మంది అధికారులు చేసిన అవినీతి, ఆరోపణలకు, క్షేత్రస్థాయిలో జరిగిన తప్పిదాలకు తాను బలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ను కలిసి అన్నీ వివరిస్తానని చెప్పారు.
ఆదివారం రాత్రి తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో కూలీగా పనిచేస్తానని చెప్పారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ వంటి పలు అంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. తొలుత నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఏడు నెలల కాలంలో వైద్య శాఖ ప్రతిష్ఠను ఇనుమడింప చేయడానికి కష్టపడి పనిచేశానన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ఏర్పాటు అవుతుందనే నమ్మకంతోనేటీఆర్ఎస్లో చేరానని గుర్తు చేశారు. ఊహించని విధంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా వైద్య శాఖను కేసీఆర్ అప్పగించారని చెప్పారు. దైవసమానుడైన ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ 7నెలల కాలంలో అందించిన సహాయ సహాకారాలు మరవలేనివని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రక్షాళన కోసం పనిచేశానని చెప్పారు.
అయితే, క్షేత్రస్థాయిలో జరిగిన తప్పులను చూసి పెద్దలు సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మరో పెద్ద తప్పు జరగకుండా ఆయన తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని రాజయ్య స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తగా రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామిని అవుతానని చెప్పారు.