చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ - రేణుకా చౌదరి నిలదీత: శపథం నెరవేరుతుంది..!!
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు..చంద్రబాబు కన్నీరు పెట్టటం పైన పలువురు స్పందిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ..సినీ ప్రముఖులు అసెంబ్లీలో జిరగిన పరిణాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తన సతీమణి గురించి వ్యాఖ్యలు చేసారంటూ కన్నీరు పెట్టటంతో...ఆడపడుచుల గురించి హీనంగా మాట్లాడుతారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. నందమూరి కుటుంబం అధికార వైసీపికి హెచ్చరిక చేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో సహా పలువురు ఈ ఘటనను తప్పు బట్టారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ పరామర్శించారు.
రజనీ కాంత్ ఫోన్..విచారం
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్ నేరుగా చంద్రబాబుకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం, 'నాకు 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డాను. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడాను' అని మైత్రేయన్ ట్వీట్ చేశారు. ఇదే అంశం పైన కేంద్ర మాజీ మంత్రి.. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి స్పందించారు.
ఇదేనా సభా మర్యాదా
శాసనసభలో ప్రతిపక్ష నేతను అవమానపరిచేందుకు ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభా మర్యాదా అని ప్రశ్నించారు. అసలు సభలో లేని, సభకు సంబంధమే లేని వ్యక్తుల పర్లు ప్రస్తావిస్తూ చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞతా అంటూ నిలదీసారు. అధికారం, సభలో మందబలం ఎప్పుడూ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. మన ప్రవర్తన, హుందాతనమే శాశ్వతమని చెప్పుకొచ్చారు. ఒక ఆడపడుచుపైన అసెంబ్లీ సాక్షిగా అసత్య ఆరోపణలు చేయడం సరికాదని... ప్రస్తుత రాజకీయాల్లో హుందాతనం లోపిస్తోందంటూ రేణుక ఆవేదన వ్యక్తం చేసారు.
చంద్రబాబు శపథం నెరవేరుతుంది
ప్రముఖ సినీనటి వాణీ విశ్వనాథ్ ఇదే అంశం పైన రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు శపథం నెరవేరుతుంది. ఆయన విజయం తథ్యమని వాణీ విశ్వనాథ్ పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఉద్దేశపూర్వకంగా కుటుంబ సభ్యులను విమర్శించడం, కుటుంబంలోని మహిళలను అవహేళనగా మాట్లాడ్డం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఓ మహిళగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని..అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి అప్రస్తుత, అవమానకర ప్రస్తావన చంద్రబాబు శపథానికి కారణమైందన్నారు. వైసీపీ పతనం ఖాయమైందని వాణీ విశ్వనాధ్ వ్యాఖ్యానించారు.
ముదురుతున్న వ్యవహారం..వైసీపీ నేతలు మాత్రం
హీరోలు నారా రోహిత్.. కళ్యాణ్ రాం సైతం ఈ పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేసారు. శాసనసభలో ఒక మహిళ గురించి అసభ్యంగా మాట్లాడటం పట్ల వారు వైసీపీ నేతల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీలకు అతీతంగా ఈ పరిణామల పైన పలువురు స్పందిస్తున్నారు. అయితే, వైసీపీ మంత్రులు..నేతలు మాత్రం తాము ఎక్కడా చంద్రబాబు సతీమణి గురించి ప్రస్తావించలేదని..అసలు ఆ చర్చ రాలేదని చెబుతున్నారు. సభలో వీడియో ఫుటేజ్ సైతం పరిశీలించుకోవచ్చని సూచిస్తున్నారు. చంద్రబాబు సానుభూతి కోసం ఆడుతున్న డ్రామాగా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు.