జీవో 77 రద్దుపై లోకేష్ నిప్పులు- జగన్ పిల్లలతో పోలుస్తూ- కులానికి బ్రాండ్ అంబాసిడర్
ఏపీలో వైసీపీ సర్కారు వ్యవహారశైలిపై టీడీపీ ఎమ్మెల్సీ, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇవాళ నిప్పులు చెరిగారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఆయన మరోసారి విమర్శించారు. గుంటూరు జైలు నుంచి విడుదలైన టీఎన్ఎస్ఎఫ్ నేతలకు జైలు వద్ద లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన లోకేష్.. వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో జీవో నంబరు 77 వల్ల మూడు లక్షల మంది విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ తెలిపారు. విద్యార్ధుల తరఫున పోరాటం చేస్తే టీఎన్ఎస్ఎఫ్ నేతలను అరెస్టులు చేస్తారా అని వైసీపీ సర్కారును లోకేష్ ప్రశ్నించారు.

జగన్కూ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులకూ తేడా
రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవాడు దుర్మార్గుడు అయితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని అంబేడ్కర్ చెప్పారని లోకేష్ గుర్తుచేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ రోజుకో అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకుని జైలుకెళ్లిన వాడు బయటకొచ్చేటప్పుడు తలదించుకుని వస్తాడు, ప్రజల కోసం పోరాటం చేసి జైలుకెళ్లిన వాళ్లు తలెత్తుకుని బయటకు వస్తారని జగన్ను ఉద్దేశించి లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి బయటికి వచ్చినప్పుడు చూశారా ? తలదించుకుని వచ్చాడు, మా టీఎఎన్ఎస్ఎఫ్ కుర్రాళ్లు ఎలా వచ్చారో చూశారా తలెత్తుకుని బయటికొచ్చారంటూ లోకేష్ సెటైర్లు వేశారు.

జగన్ రెడ్డి ఇల్లుముట్టడిస్తే రేప్ కేసా ?
రాష్ట్రంలో ఐపీసీ అమలు కావడం లేదని, జేపీసీ అమలు అవుతుందని లోకేష్ ఆరోపించారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారని లోకేష్ విమర్శించారు. ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నారంటూ దళిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి బేడీలు వేశారని, సీఎం సొంతూరిలో దళిత మహిళ నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయమని ఛలో పులివెందుల కార్యక్రమం నిర్వహిస్తే తెలుగు మహిళ నాయకురాలు అనిత, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుపై అట్రాసిటీ కేసులు పెట్టారని లోకేష్ ఆరోపించారు. జీవో 77 రద్దు కోసం సీఎం ఇంటి ముట్టడికి వెళ్లిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులపై ఏకంగా రేప్ కేసు పెట్టారని విమర్శించారు.

జగన్ పిల్లలకో న్యాయం, ఎస్సీ విద్యార్ధులకో న్యాయం
జీవో 77 తీసుకొచ్చి బడుగు, బలహీన వర్గాల విద్యార్ధులకు అన్యాయం చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. 3 లక్షల మంది విద్యార్ధులు ఉన్నత విద్య చదువుకునే అవకాశం లేకుండా చేశారని వైసీపీ సర్కారుపై లోకేష్ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదువుకునే విద్యార్దులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని లోకేష్ అన్నారు. జగన్ రెడ్డి పిల్లలు మాత్రం విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు మాత్రం ఇక్కడే ఉండిపోవాలా అని లోకేష్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని వైసీపీ సర్కారు నిర్వీర్యం చేసిందని, పథకంలో భాగంగా విదేశాలు వెళ్లిన విద్యార్ధులకు నిధులు విడుదల చేయడం లేదని లోకేష్ ఆరోపించారు. దీంతో తల్లితండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోదు, విదేశాల్లో ఉండిపోయిన పిల్లల భవిష్యత్తు ఏంటో అర్ధం కాక ఎంతో మంది తల్లితండ్రులు భయపడుతున్నారని లోకేష్ విమర్శించారు.

కులపిచ్చికి జగన్ బ్రాండ్ అంబాసిడర్
జగన్ మడమ తిప్పను, మాట మార్చను అని బిల్డప్ ఇచ్చారని, ఇప్పుడు మాట మార్చారని, మడమ తిప్పారని లోకేష్ ఆరోపించారు. జగన్ కులపిచ్చికి బ్రాండ్ అంబాసిడర్గా మారారని లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూనివర్శిటీలను రాజకీయ వేదికలుగా మార్చేశారని, 13 వర్శిటీలు ఉంటే 11 వర్శిటీల్లో వీసీలు ఒకే సామాజిక వర్గం వారు ఉన్నారని లోకేష్ గుర్తుచేశారు. పాలకమండళ్లలోనూ 90 శాతం సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారన్నారు. రాజకీయ నేపథ్యం, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి పాలమండళ్లలో చోటివ్వాలని, కానీ యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కారన్నారు.

22 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా ?
జీవో 77 రద్దు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని లోకేష్ హెచ్చరించారు.. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏమైంది ?, జగన్ రెడ్డి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా రాలేదని, ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని లోకేష్ తెలిపారు. కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రం వదిలీ పోతున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యార్ధుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందన్నారు. అసలు జీవో 77 ఎందుకు అమలు చేస్తున్నారో జగన్ సమాధానం చెప్పాలన్నారు.
విద్యాశాఖ మంత్రి రబ్బరు స్టాంపుగా మారిపోయారన్నారు.












Click it and Unblock the Notifications