‘బాహుబలి’లా చంద్రబాబు, ‘అమరావతి’లో రోజా పాత్రేమిటి?: రాజేంద్రప్రసాద్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి'కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఊహా చిత్రాలు, వీడియోలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం ఎమ్మెల్సీ విబి రాజేంద్రప్రసాద్ ఖండించారు. బుధవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోజాకు సహజంగా ఉన్న అహంభావంతోనే అలా మాట్లాడారని అన్నారు. అయితే తెలిసో, తెలియకో రోజా చెప్పినట్లు.. ‘బాహుబలి', ‘మగధీర'లు అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశారని చెప్పారు.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఓ అసాధ్యాన్ని చేసి చూపించబోతున్నారని చెప్పారు. పాపి చిరాయువు అన్నట్టు రోజా అమరావతి రాజధాని పూర్తయ్యే వరకూ జీవించి ఉండాలన్నారు. అమరావతి నిర్మాణంలో మీ పాత్ర విలనా, వ్యాంపా? అని ప్రశ్నించిన ఆయన, ఎటూ విలన్ పాత్రకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి.. మీది వ్యాంప్ పాత్రేనని వ్యాఖ్యానించారు.
కాగా, రోజా మంగళవారం మాట్లాడుతూ.. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్కు లక్ష కోట్ల నజరానా ఇస్తోందని ఆరోపించారు. రాజధాని నగర నిర్మాణ బాధ్యత కేంద్రానిదా.. సింగపూర్దా? అని ప్రశ్నించారు.
ఈ మాస్టర్ ప్లాన్ చూస్తుంటే మగధీర, బాహుబలి సినిమా ట్రైలర్లు చూసినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల్లోని అందమైన కట్టడాలను ఒకచోటకు తెచ్చి రాజధాని అంటూ చూపిస్తున్నారని అన్నారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగర నిర్మాణం ఎలా సాధ్యమని సందేహం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్లో రైతులు, బడుగులకు చోటెక్కడ ఉందని ప్రశ్నించారు.