రజినీ, పవన్ కలుస్తారా?: పార్టీలకు భారీ నష్టమే!
తమిళనాడులో రజినీకాంత్.. తెలంగాణలో అంతగా ప్రభావం చూకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ కీలకంగా మారుతున్నారు.
చెన్నై/హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే, ఇటీవల అభిమానులతో సమావేశం నిర్వహించిన రజినీకాంత్.. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ దాదాపు ఖరారు చేశారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని ఆయన చెప్పడం గమనార్హం.
అటు రజినీ.. ఇటు పవన్
ఈ నేపథ్యంలో రజినీకాంత్ కొత్త పార్టీ పెడతారా? లేక ఏదైనా జాతీయ పార్టీలో చేరతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, రజినీకాంత్ కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు మాత్రం వెలువడుతున్నాయి. ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన పార్టీ పెట్టి పార్టీ నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే.
కలుస్తారా..?
ఈ క్రమంలో తమిళనాడులో రజినీకాంత్.. తెలంగాణలో అంతగా ప్రభావం చూకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ కీలకంగా మారుతున్నారు. ఇప్పటికే ఉత్తరాదివారు దక్షిణాదిపై చిన్నచూపు చూస్తున్నారంటూ పలుమార్లు ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్.. రజినీతో కలిసి పోరాటం సాగిస్తారా? అనే అంశంపై తెరపైకి వచ్చింది. వీరిద్దరికి కూడా ఒకరంటే ఒకరికి అభిమానం, గౌరవం ఉండటం గమనార్హం.
పవన్ లానే చేస్తారా..?
తమిళనాడు పరిస్థితుల నేపథ్యంలో రజినీ బీజేపీతో జట్టుకట్టే పరిస్థితులు లేవనే తెలుస్తోంది. సొంతపార్టీ పెడితేనే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ లానే రజినీ కూడా సొంత పార్టీ పెట్టి ఏదైనా జాతీయ పార్టీకి మద్దతు తెలుపుతారా? అనేది ఉత్కంఠగా మారింది. అదే సమయంలో జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా పార్టీని విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కూడా గత ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలకు మద్దతు పలికిన విషయం తెలిసిందే.
రజినీ పార్టీ ప్రకటనపై ఆసక్తి
మార్పు నినాదంతో అంతిమ యుద్ధం కోసం సిద్ధమవ్వాలని రజినీ తన అభిమానులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రజినీ రాజకీయ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారని అందరూ ఒక అంచనాకు వచ్చేశారు. రజినీకాంత్ పార్టీ పేరేంటి? గుర్తేమిటి? ఎప్పుడు ప్రకటిస్తారు? అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది.
సిద్ధమవుతున్న పవన్
కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన అధినేతగా మారి చాలా కాలమైంది. ఎన్నికలకు సమయం ఉండటంతో తన పార్టీని పటిష్టంగా నిర్మించుకునే పనిలో ఉన్నారు. తనదైన శైలిలో ఆవేశపూరిత ప్రసంగాలతో రాష్ట్రంలోని పలు సమస్యలపై ఇప్పటికే ఆయన పలుమార్లు స్పందించారు. ట్విట్టర్ ద్వారా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు.
ఒకరంటే ఒకరికి అభిమానం
అయితే ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేయనున్న రజినీ, ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కలుస్తారా? అనే అంశంపై పలువురిలో ఆసక్తిక నెలకొంది. వీరిద్దరూ సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న వారు కోవడంతో ఈ చర్చకు ప్రాధాన్యత సంతరించుకుంది. రిజనీకి తమిళనాడు అభిమానుల ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్కు కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ వారి వారి రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలావుంటుందనేది ఆసక్తిగా మారింది. అంతేగాక, వీరి వల్ల ఆయా పార్టీలకు భారీ నష్టం కూడా తప్పకపోవచ్చు.