అందరివాడే: వెంకయ్యను ‘బడే భాయ్’ అంటూ రాజ్నాథ్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతగా ఎన్నో పదవులు అనుభవించారు. ఎన్డీఏ ప్రభుత్వంలోనూ ఆయనది కీలక పాత్ర. ఆయనే అందరివాడైన వెంకయ్యనాయుడు. ప్రస్తుతం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు... బిజెపిలోని నేతలందరికీ పెద్దన్నయ్యే.
ఇదేదో మనకు మనం చెప్పుకుంటున్న విషయం ఎంతమాత్రం కాదు. కేంద్ర కేబినెట్లో కీలక మంత్రులుగా ఉన్న రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలాంటి కీలక నేతలు చెబుతున్నది. 'వెంకయ్య మాకు అన్నయ్యలాంటి వారు' అంటూ పార్లమెంటు సాక్షిగా జైట్లీ చేసిన వ్యాఖ్యలు గతంలో ఆసక్తి రేకెత్తించాయి.
తాజాగా మంగళవారం రాజ్నాథ్ సింగ్ మరో అడుగు ముందుకేసి... వెంకయ్యను 'పెద్దన్నయ్య'గా అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల అమలు కోసం రంగంలోకి దిగిన వెంకయ్య మంగళవారం రాజ్నాథ్ను కలిశారు.
ఈ సందర్భంగా విభజన హామీల అమలు కోసం నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోం శాఖే... మిగిలిన అన్ని శాఖలతో సంప్రదింపులు జరిపితే బాగుంటుందని రాజ్నాథ్ను కోరారు. దీనికి రాజ్ నాథ్ సింగ్ కూడా సానుకూలంగా స్పందించారు.
అంతేగాక, 'మీరూ మాట్లాడండి' అంటూ వెంకయ్యకు రాజ్ నాథ్ సింగ్ సూచించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'దానిదేముంది... మీరు కూడా అందరితో మాట్లాడవచ్చు. మీరు మా బడే భాయ్' అనిరాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.
కాగా, తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లోనే వెంకయ్య పాత్ర కీలకంగానే ఉంటుంది. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమ రాష్ట్రానికి పెద్ద దిక్కు వెంకయ్యనాయుడేనని చెప్పారు. కేంద్రం నుంచి ఏ సాయం కావాలన్నా.. దగ్గరుండి చూసుకుంటారని కొనియాడారు.