టీడీపీ ఎమ్మెల్యేల బలమెంతో కాస్సేపట్లో బహిర్గతం: వారి ఓటు ఎటో తేలుతుంది: అచ్చెన్నకూ
అమరావతి: రాజ్యసభ ఎన్నికల ముహూర్తం సమీపించింది. రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి కాస్సేపట్లో పోలింగ్ ఆరంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ఆవరణలోని మీటింగ్ హాలులో పోలింగ్ నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో నాలుగు స్థానాలకు అయిదుమంది రేసులో ఉన్నందున ఎన్నికలు తప్పనసరి అయ్యాయి. శాసనసభ్యులు ప్రాధాన్యత క్రమంలో రాజ్యసభ అభ్యర్థులను ఎన్నుకుంటారు.
చైనాపై తాడో పేడో: ఎల్లుండి అఖిలపక్ష భేటీ: కమ్యూనిస్టులపై ఫోకస్: యుద్ధం చివరి అస్త్రంగా
నాలుగు స్థానాలూ వైసీపీ ఖాతాలోకే
ఇప్పుడున్న బలబలాలను ఆధారంగా చేసుకుని చూసుకుంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ ఎగరేసుకుని పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీకి ఉన్న శాసనసభ్యుల సంఖ్యాబలం అలాంటిది. నాలుగు స్థానాలను గెలుచుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు. అదొక్కటే కాదు.. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తెలుగుదేశం పార్టీకి, శాసనసభ సభ్యత్వానికీ రాజీనాామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీకి దూరంగా ఉంటోన్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, అధికార పార్టీకి మద్దతు ప్రకటించిన కరణం బలరామకృష్ణమూర్తి ఓట్ల కూడా వైసీపీకే పడే అవకాశాలు ఉన్నాయి.
టీడీపీకి ఎంతమంది ఎమ్మెల్యేల బలం ఉందో..
రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం తెలుగుదేశం పార్టీకి లేదు. కనీసం పోటీ ఇచ్చే అవకాశం కూడా టీడీపీకి లేదు. టీడీపీకి ఉన్నది 23 మంది శాసనసభ్యులు మాత్రమే. అందులోనూ ముగ్గురు ఇప్పటికే వైసీపీకి మద్దతు ప్రకటించారు. దీనితో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య సాంకేతికంగా 20కి పడిపోయింది. టీడీపీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి.
వారి ఓటు ఎటు..
గుంటూరు జిల్లాకు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు ఈ జాబితాలో ఉన్నారు. తాను పార్టీ మారట్లేదంటూ ఏలూరి సాంబశివరావు అనంతరం క్లారిటీ ఇచ్చారు. వారితో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు తమ అభ్యర్థులకు ఓటు వేసేలా వైసీపీ అగ్ర నాయకులు ఇప్పటికే చక్రం తిప్పారని అంటున్నారు. సంఖ్యాపరంగా టీడీపీని బలహీనపర్చడానికి రాజ్యసభ ఎన్నికలను ఓ వేదికగా వైసీపీ వినియోగించుకోనుందని చెబుతున్నారు. కాగా- ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Recommended Video
పోటీలో ఉన్నది వీరే..
రాజ్యసభ ఎన్నికల బరిలో మొత్తం అయిదు మంది అభ్యర్థులు నిల్చున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు, తెలుగుదేశం తరఫున ఒకరు పోటీ చేస్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యా రామిరెడ్డిలతో పాటు పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వాని అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున ఆ పార్టీ పొలిట్ బ్యురో సభ్యుడు వర్ల రామయ్య తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పరిమళ్ నత్వానీకి రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలంటూ స్వయంగా ముఖేష్ అంబానీ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.