సాయిరెడ్డి వర్సెస్ రఘురామ వార్ ! ఆ పదవే టర్నింగ్ పాయింట్ ? ఈసారి తేల్చేస్తారా ?
ఏపీలో వారిద్దరూ అధికార వైసీపీ ఎంపీలే. ఇందులో ఒకరు లోక్ సభ ఎంపీ కాగా.. మరొకరు రాజ్యసభ ఎంపీ. వీరిద్దరూ గత మూడేళ్లుగా పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు. అలాగే కేంద్రం వద్ద తమకున్న పరపతిని చాటుకునేందుకు, పరస్పరం పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీని ధిక్కరిస్తున్న సదరు లోక్ సభ ఎంపీపై ఎలాగైనా అనర్హత వేటు వేయించేందుకు ఈ రాజ్యసభ ఎంపీ తీవ్రంగా ప్రయత్నించారు కూడా. అయినా ఎలాంటి ఫలితం లేదు. దీనిపై పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లు వరకూ వెళ్లారు. అయినా ఏమీ జరగలేదు. కానీ తాజాగా ఈ రాజ్యసభ ఎంపీకి లభించిన కీలక పదవి ఓ టర్నింగ్ ఇస్తుందనే అంచనాలున్నాయి.
సాయిరెడ్డి వర్సెస్ రఘురామ
వైసీపీ నుంచి లోక్ సభ సభ్యుడిగా గెలిచిన రఘురామకృష్ణంరాజు, రాజ్యసభకు నామినేట్ అయిన విజయసాయిరెడ్డి మధ్య మూడేళ్లుగా వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో సాగే వార్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఢిల్లీ వేదికగా, అదీ పార్లమెంటు వేదికగా వీరిద్దరి మధ్య వార్ సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందంటూ కేంద్రాన్ని అడిగి వై కేటగిరీ భద్రత తీసుకున్న రఘురామను ఏపీలో అడుగుపెట్టకుండా చేయడంలో సాయిరెడ్డి సక్సెస్ అయితే తనపై అనర్హత వేటు వేయాలంటూ సాయిరెడ్డి చేసిన ప్రయత్నాలను రఘురామ విజయవంతంగా అడ్డుకున్నారు. తద్వారా ఎవరికి వారు కేంద్రంలో తమకున్న సంబంధాలతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని వాడుకున్నట్లయింది.
అక్కడ రఘురామదే పైచేయి
వైసీపీ సర్కార్ తో మూడేళ్ల క్రితమే విభేదించినా రఘురామరాజుపై అనర్హత వేటు వేయించడంలో మాత్రం సాయిరెడ్డి సక్సెస్ కాలేకపోయారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నప్పటికీ, కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్నప్పటికీ రఘురామపై అనర్హత వేటు వేయించడంలో సాయిరెడ్డి విఫలమయ్యారు. ఇదిగో, అదిగో అంటూ కాలం గడిపేయడం మినహా రఘురామను అనర్హత వేటు వ్యవహారంలో ఇబ్బంది పెట్టలేకపోవడం సాయిరెడ్డికి మైనస్ గా మారింది. ముఖ్యంగా ఢిల్లీలో వైసీపీ తరఫున చక్రం తిప్పేందుకు జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా రఘురామ విషయంలో సాయిరెడ్డి ఏమీ చేయలేకపోవడానికి ఆయనకు కేంద్రంలో బీజేపీతో ఉన్న సంబంధాలే కారణం.
సాయిరెడ్డికి రాజ్యసభ పదవితో..
రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానల్ కు ఎంపికైన ఎంపీల్లో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది. కానీ ఆయనపై రాజ్యసభ ఛైర్మన్ కూ, బీజేపీ పెద్దలకు రఘురామ చేసిన ఫిర్యాదులతో సాయిరెడ్డి పేరు మధ్యలో తొలగించారు. కానీ తిరిగి ఆయన కేంద్రం వద్ద తనకున్న పలుకుబడి ఉపయోగించి తిరిగి వైస్ ఛైర్మన్ ప్యానల్లోకి చేరారు. తాజాగా రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్కడ్ సాయిరెడ్డికి వైస్ ఛైర్మన్ ప్యానల్లో చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సాయిరెడ్డి పంతం నెగ్గించుకున్నట్లయింది. ముందు తనపేరు ప్యానల్లో పెట్టి ఆ తర్వాత తొలగించడంతో మనస్తాపానికి గురైనట్లు కనిపించిన సాయిరెడ్డి.. ఈ మేరకు ట్విట్టర్ లో తాను పెట్టిన పోస్టును కూడా తొలగించారు. కానీ తాజా పరిణామాలపై సాయిరెడ్డి సంతృప్తిగా కనిపిస్తున్నారు.
రఘురామపై ఈసారి తేల్చేస్తారా ?
రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానల్లోకి చేరిన విజయసాయిరెడ్డి రెబెల్ ఎంపీ, తన ప్రత్యర్ధి రఘురామకృష్ణంరాజుపై పైచేయి సాధించారు. అదే సమయంలో కేంద్రం వద్ద తనకున్న పట్టు నిరూపించుకున్నారు. తద్వారా కేంద్రంపై రఘురామ విషయంలో ఒత్తిడి పెంచేందుకు ఆయనకు ఉన్న అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి. గతంలో రఘురామపై అనర్హత వేటు కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన సాయిరెడ్డి.. ఇప్పుడు రాజ్యసభ వైస్ ఛైర్మన్ స్ధాయిలో ఏమీ చేయలేకపోయినా, ఆ మేరకు పెరిగిన పరపతితో లోక్ సభ స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి రఘురామపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికల లోపు ఎలాగైనా రఘురామపై అనర్హత వేటు పడేలా చేస్తే కీలక సమయంలో రఘురామను దెబ్బకొట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు.