ఎపి నేతలతో అమిత్ షా భేటీ: ఎపి వ్యవహారాల ఇంచార్జీ రామ్ మాధవ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా రామ్ మాధవ్ నియమితులయ్యారు. ఊహించినట్లుగానే సిద్ధార్థ్ సింగ్ స్థానంలో ఆయన ఎపి పార్టీ వ్యవహారాల బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్డీఎ నుంచి వైదొలిగిన నేపథ్యంలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పార్టీ నేతలతో శనివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎపి కీలక నేతలంతా పాల్గొన్నారు.
త్రిపుర ఎన్నికల్లో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని గద్దె దించి బిజెపిని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర ప్రధానమైంది. ఎపిలో త్రిపుర తరహా వ్యూహాన్ని అనుసరించాలని బిజెపి భావిస్తున్న తరుణంలో ఎపి వ్యవహారాల బాధ్యతను రామ్ మాధవ్ను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కూడా. అమిత్ షాతో శనివారం జరిగిన సమావేశంలో రామ్ మాధవ్తో పాటు జివిఎల్ నరసింహారావు, హరిబాబు, దగ్గుబాటి పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.