పైకి ఫాషన్, లోపల ఫ్యాక్షన్: ఆదిపై రామసుబ్బా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య
కడప: ఏపీ సీఎం, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు.. పార్టీలోకి ఎమ్మెల్యేల చేరిక చిక్కులు తెచ్చేలాగే కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో శిల్పా సోదరుల అనుచరుడు తులసి రెడ్డి పైన భూమా నాగిరెడ్డి వర్గీయులు దాడి చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో వైసిపి నుంచి చేరిన ఎమ్మెల్యేలతో ఇప్పటికే ఉన్న టిడిపి నేతలు లేదా ప్రజాప్రతినిధుల మధ్య ఇంకా కుదురుకున్నట్లుగా కనిపించడం లేదు. తాజాగా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టిడిపి సీనియర్ నేత రామసుబ్బా రెడ్డిల మధ్య మరోసారి మాటల యుద్ధం కనిపించింది.
ఇద్దరు నేతలు ఇప్పుటు ఒకే పార్టీ నేతలుగా ఉంటున్నప్పటికీ వారిద్దరి మధ్య విభేదాలు మాత్రం దూరం కాలేదు. ఆదివారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆదినారాయణ రెడ్డి పైన రామసుబ్బా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
పార్టీలో చేరేదాకా బాగానే ఉన్న ఆది నారాయణరెడ్డి, ఈ తర్వాత ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు తనను, ఎంపీ సీఎం రమేశ్ను ఆహ్వానించరాదని ఆదినారాయణ రెడ్డి అనుచరులు బహిరంగంగానే కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు.
అయితే ఎప్పటి నుంచో తమ వెంట, పార్టీని వీడకుండా ఉన్న కార్యకర్తలు ఆది మాటలు వినడం లేదని, దీంతో ఆదినారాయణ రెడ్డి వర్గం బెదిరింపులకు దిగుతోందన్నారు. ఉగాది వేడుకలకు తమను ఆహ్వానించిన పెద్దదండ్లూరు, సిరిగేపల్లికి చెందిన పార్టీ కార్యకర్తల ఇళ్లపై ఆయన వర్గం దాడులకు తెగబడిందన్నారు. పైకి ఫ్యాషన్ అంటూ లోపల ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తున్న ఆది తన ద్వంద్వ వైఖరిని మానుకోవాలన్నారు.