‘జగన్ యువభేరి ఎందుకో అర్థం కాలేదు’: ప్రత్యేక హోదాపై రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలు యువతను రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నాయని.. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
బుధవారం ఆయన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళంలో మంగళవారం విద్యార్థులతో యువభేరి ఎందుకు నిర్వహించారో అర్థం కాలేదని రామ్మోహన్ నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా విద్యార్థులను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏమీ చేయడం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ప్రత్యేక హోదా కల్పించాలని కోరినట్లు చెప్పారు.
దీనికి ప్రధాని సానుకూలంగా స్పందిచారని చెప్పారు. నీతి ఆయోగ్ను నివేదిక ఇవ్వమన్నారని, ఆ నివేదిక అందాక ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రకటన చేస్తారని చెప్పారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో విశాఖను ప్రత్యేక రైల్వేజోన్గా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.