జగనన్న రామరాజ్యం; కళ్ళున్న కబోదులా.. పరిటాల ఫ్యామిలీపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సెన్సేషన్
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈసారి పరిటాల కుటుంబం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
టిడిపి నేతలు కళ్ళు ఉన్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి, ఆయన సతీమణి భువనేశ్వరికి ఏపీ అసెంబ్లీ వేదికగా జరిగిన అవమానంపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పరిటాల సునీత గౌరవ సభలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ గౌరవ సభల నిర్వహణపై మాజీ మంత్రి పరిటాల సునీతను, పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జగనన్న రామ రాజ్యంలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటే, టిడిపి నేతలు కళ్ళు ఉన్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గౌరవ సభలతో మిమ్మల్ని మీరు అగౌరవపరచుకుంటున్నారు
గౌరవ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కనిపిస్తున్నా, నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉన్నా మీకేమీ పట్టడం లేదా అంటూ నిలదీశారు. మిమ్మల్ని మీరు అగౌరవపరచడం కోసమే గౌరవ సభలు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో దశాబ్దాలపాటు వలస బాట పట్టిన ఎంతోమంది ప్రజలు, నేడు జగనన్న రామరాజ్యంలో తిరిగి తమ సొంత ఊర్లకు వచ్చి జీవనం సాగిస్తున్నారని, ఈ విషయం మీకు తెలియదా అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత ను నిలదీశారు.
టీడీపీ నేతలకు అభివృద్ధి కనిపించటం లేదా?
రాప్తాడు నియోజకవర్గంలో సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ముందుకు తీసుకు వెళ్లడం ధ్యేయంగా తాము కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. అర్హులందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇస్తున్నామని, సొంతింటి కలను సాకారం చేయడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, రాప్తాడు నియోజకవర్గంలో 30 వేల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్న ప్రకాష్ రెడ్డి, టిడిపి నేతలకు ఇవేవీ కనిపించటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ సర్కార్ చేస్తున్న జలయజ్ఞం మీ పచ్చ నాయకులకు కనబడడం లేదా?
లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే జలయజ్ఞం మీకు కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. నాలుగు రిజర్వాయర్ల నిర్మాణం చేశామని, గంగలకుంట బొమ్మపర్తి చెరువులకు జల కళ తెచ్చామని, ప్రతి ఎకరానికి సాగు నీరు అందేలా చేస్తున్న జలయజ్ఞం మీ పచ్చ నాయకులకు కనబడడం లేదా అంటూ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ నేతల తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ లు చంద్రబాబుకు, ఆయన సతీమణి భువనేశ్వరికి జరిగిన అవమానంపై గౌరవ సభలు నిర్వహిస్తూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జగన్ కు తగిన బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల ఫ్యామిలీ ని టార్గెట్ చేశారు.