తిరుచానూరు పద్మావతి అమ్మవారి గర్భాలయంలో..
Ratha Saptami 2025: ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఈ తెల్లవారు జామున సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపారు.
6 నుండి ఉదయం 9 గంటల మధ్య కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా- ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

ఆ తరువాత భక్తులకు సర్వదర్శనం కల్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తారు. రథసప్తమి, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది.
హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకట రామ ప్రసాద్ శర్మ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఎనిమిది పరదాలను బహుకరించారు. ఈ పరదాలను దేవస్థానం డిప్యూటీ ఈవో గోవిందరాజన్, అర్చకులు బాబుస్వామికి అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో ఈ పరదాలను అలంకరించనున్నారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న మంగళవారం రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటి నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు.
ఇక- సాయంత్రం 3: 30 నుండి 4: 30 గంటల వరకు స్నపనతిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య చంద్రప్రభ వాహనం, రాత్రి 8: 30 నుంచి 9: 30 గంటల వరకు గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు. సమస్త భక్తజన కోటిని కరుణిస్తారు.
రథసప్తమి కారణంగా ఫిబ్రవరి 4న ఆలయంలో శ్రీ అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్ సేవ, వేదాశీర్వచనం సేవలతోపాటు బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications