సరుకుల కోసం రేషన్ షాప్ చుట్టూ తిరగడం కాదు.. సెప్టెంబర్ 1 నుండి ఇక నేరుగా మీ ఇంటికే!
Recommended Video
ఏపీలో జగన్ తన మార్క్ పాలన సాగిస్తున్నారు . అవినీతి రహిత పారదర్శక పాలనే ధ్యేయంగా పని చెయ్యాలని మంత్రులకు సూచించారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే నిర్మొహమాటంగా పక్కన పెడతానని హెచ్చరించారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ పారదర్శక పాలనను అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక జగన్ బాటలోనే మంత్రులు సైతం శాఖాపరమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ బాటలో ముందుకు సాగుతున్నారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొడాలి నానీ .. రేషన్ సరుకులు ఇంటికే పంపిణీ చేస్తామన్న మంత్రి
అనుమతులు లేని స్కూళ్ళు, కళాశాలలపై కొరడా ఝళిపిస్తామని విద్యాశాఖామంత్రి , ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తామని రవాణా శాఖా మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పౌర సరఫరా వ్యవశాలోని లోపాలను సవరించి నిరుపేదలకు రేషన్ అందించేలా పని చేస్తానని చెప్తున్నారు పౌర సఫరాల శాఖా మంత్రి కొడాలి నానీ . సెప్టెంబర్ 1 నుంచి నేరుగా ఇంటింటికి రేషన్ సరుకులను పంపిణీ చేస్తామన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. గురువారం అమరావతి సచివాలయం 4వ బ్లాకులో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. పౌర సరఫరాల శాఖా మంత్రిగా తన శాఖ పనితీరు మెరుగుదలకు , అవినీతి లేని పాలనకు కృషి చేస్తానని చెప్పారు. పేదలు, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు.

సెప్టెంబర్ 1 నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఇంటికే రేషన్ సరుకులు
సెప్టెంబర్ 1 నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కుటుంబ సభ్యులను బట్టి రేషన్ బియ్యం, ఆరు లేదా ఏడు రకాల వివిధ నిత్యావసర సరుకులతో కూడిన బ్యాగులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి నానీ పేర్కొన్నారు. అదేవిధంగా రైతులు పంట వేయకముందే వారు పండించనున్న పంటకు కనీస మద్ధతు ధరను ముందుగానే ప్రకటించి ప్రతి రైతుకు మద్ధతు ధరను అందించేందుకు వీలుగా బడ్జెట్లో రూ.3వేల కోట్లతో మార్కెట్ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాట్లు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. పౌర సరఫరాల వ్యవస్థను బలోపేతం చేస్తానని పేదలకు అందాల్సిన రేషన్ అందేలా చూస్తానని మంత్రి కొడాలి నానీ పేర్కొన్నారు.

కొత్త మంత్రులలో ఉత్సాహం .. జగన్ బాటలో దూకుడు
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏపీలోని మంత్రులు జగన్ సూచనల మేరకు వివిధ శాఖల ప్రక్షాళనకు నడుం బిగించారు. పాలనలో తమ మార్క్ చూపించాలని కొత్త మంత్రులు ఉత్సాహంతో ఉన్నారు. జగన్ సైతం శాఖలపై పూర్తి కమాండ్ మంత్రులకు ఇచ్చి దూసుకుపొమ్మన్నారు. చూడాలి మరి ఏపీ మంత్రులు తమ పాలనతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారో లేదో !












Click it and Unblock the Notifications