వెనక్కి తగ్గిన రావెల, మీడియాపై నెపం: కామినేని ఫైర్
హైదరాబాద్: బిజెపితో తెలుగుదేశం పొత్తు విషయంలో తాను చేసిన వ్యాఖ్యల నుంచి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు రావెల కిశోర్ బాబు వెనక్కి తగ్గారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆయన తప్పు పట్టారు. టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహించడంతో, బిజెపి ఆంధ్రప్రదేశ్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేత రావడంతో ఆయన మాట మార్చినట్లు కనిపిస్తున్నారు. బిజెపితో పొత్తుపై తాను ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని రావెల కిశోర్ బాబు అన్నారు.
కాగా, రావెల కిశోర్ బాబు వ్యాఖ్యలను బిజెపి నేత, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తప్పు పట్టారు. టిడిపి, బిజెపి పొత్తు చారిత్రక అవసరమని ఆయన అన్నారు. పార్టీల మధ్య పొత్తులు మంత్రుల స్థాయిలో నిర్ణయించేవి కావని ఆయన అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో సుపరిపాలన కోసమే పొత్తులు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కిశోర్ బాబు తన వ్యాఖ్యలపై చంద్రబాబుకు వివరణ ఇచ్చారు.
బీజేపీతో టీడీపీ పొత్తుపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మంత్రి రావెల కిషోర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్కిషోర్ మండిపడ్డారు. రావెల వ్యాఖ్యలను తన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. జిల్లాలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో శ్యామ్కిషోర్ పాల్గొన్నారు.

బిజెపితో పొత్తు అంశంపై వ్యాఖ్యలు చేసిన సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం రావెలను పిలిచి, వ్యాఖ్యలపై వివరణ కోరినట్లు సమాచారం. తనతో సంప్రదించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు బిజెపితో పొత్తు కొనసాగుతుందని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. బిజెపితో పొత్తు అంశంపై తాము పునరాలోచన చేసుకుంటామని మంత్రి రావెల కిశోర్ బాబు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.
కాగా, బిజెపితో పొత్తుపై తెలుగుదేశం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని మంత్రి రావెల అన్నారు. ప్రత్తిపాడులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో ఎంత వరకు మిత్రపక్షంగా కొనసాగాలన్నది ఆలోచించాల్సి ఉందన్నారు. ఇటీవల బీజేపీలోకి పలువురు వలస పోవడంపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రాజెక్టులు, కేంద్రం సాయం కోసమే బీజేపీతో జత కట్టామన్నారు. పార్టీ సిద్ధాంతాలపై రాజీపడేది లేదన్నారు. కాగా, రాజధాని కోసం భూ సేకరణపై జమ్ముల శ్యాం కిషోర్లాంటి బీజేపీ చోటా నేతలకు సమాధానం చెప్పనని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, హరిబాబు లాంటి స్థాయిగల వారు మాట్లాడితేనే స్పందిస్తానని మరో ప్రశ్నకు జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications