ఆ టేపులు సాక్ష్యాలా?: ఓటుకు నోటుపై రావెల, ముద్రగడపై జూపూడి ఫైర్
హైదరాబాద్/అనంతపురం: ఓటుకు నోటు కేసుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు బుధవారం స్పందించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకే తెరపైకి ఓటుకు నోటు కేసు తీసుకువచ్చారని అన్నారు.
అంతేగాక, ఎలాంటి కేసుల్లోనైనా ఆడియో టేపులు సాక్ష్యాలుగా నిలవవని మంత్రి రావెల కిశోర్బాబు తేల్చిచెప్పారు. అనంతపురం జిల్లా మడకశిరలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు కేసులు బనాయించడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమీలేదన్నారు.
ఇప్పటికే సుప్రీం కోర్టు వీడియో, ఆడియో టేపులు, స్టింగ్ ఆపరేషన్లను కోర్టులో సాక్ష్యాలుగా పరిగణించరని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రతిష్టను, ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయడానికే తెలంగాణ ప్రభుత్వం, విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
అవినీతి కుంభ కోణాల్లో కూరుకుపోయింది ఎవరో ప్రజలకు తెలుసని, వైసీపీ మునిగిపోయే నావని అన్నారు. బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక హోదా సాధించేంత వరకు విశ్రమించబోమన్నారు.
కులం పేరుతో ఎదిగిన ముద్రగడ: జూపూడీ
హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలతో ముద్రగడ ఎలా కలుస్తారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాన్ని అడ్డం పెట్టుకుని మంత్రిగా, ఎంపీగా ఎదిగిన ముద్రగడ కాపులకు ఏం చేశాడో చెప్పాలంటూ జూపుడి ప్రశ్నించారు.
కాపుల అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు హయంలోనే కాపుల కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, వేలాది కోట్ల నిధుల కేటాయింపు విషయం మరవద్దని జూపూడి ప్రభాకర్ హితవు పలికారు.