కన్నా ఓ సైకిల్ షాప్ ఓనర్ కొడుకు, మైసూరా సీమ చిచ్చు: రావెల, కాపులే మా బలం: గాలి
అమరావతి: తెలుగుదేశం పార్టీ పైన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ నేతల పైన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన మంత్రి రావెల కిషోర్ బాబు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మాజీ మంత్రి, ప్రస్తుత బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ తండ్రి ఓ సైకిల్ దుకాణానికి యజమాని అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి కుటుంబం ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలని నిలదీశారు. బిజెపి నేతల వ్యాఖ్యలను వారి వ్యక్తిగత విమర్శలుగానే చూస్తామని, పార్టీవిగా చూడమని చెప్పారు.
వైసిపి నేత మైసూరా రెడ్డి పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరా రాష్ట్రంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని భగ్గుమన్నారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని ఎగదోసి ఏపీలో చిచ్చుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, వైసిపిలపై గాలి ఆగ్రహం
కుల, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. కాపుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు.
కాపులను బిసిల్లో చేర్చేందుకు కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హరిరామ జోగయ్య రాసిన పుస్తకం అతని మానకిస పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తోందన్నారు. కాపులు టిడిపికి ప్రధాన బలమని, వారిని టిడిపి నుంచి ఎవరూ వేరు చేయలేరన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: దేవినేని
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. విజయనగరం జిల్లా గట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయాన్ని ఆయన పరిశీలించారు. నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.